కాలం మారింది. అందుకు తగ్గట్లే తరాలు మారుతున్నాయి. ఒకప్పుడు మగ మహారాజు కటౌట్ తో ఇంట్లో మోనార్క్ లా వ్యవహరిస్తూ.. భార్య ల్ని ఇబ్బంది పెడుతూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే భర్తల గురించి విన్నాం. వారితో వేగలేక జీవితాన్ని అర్ధాంతరంగా ముగించే అమాయక భార్యల ఉదంతాలెన్నో. ఇప్పుడు సీన్ మారింది. బాధితురాలిగా భార్య కాదు భర్త నిలుస్తున్నాడు.
భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక.. ఎవరికి చెప్పుకోలేక.. చట్టబద్ధమైన రక్షణ లేని కారణంతో తీవ్రమైన మానసిక వ్యధకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న భార్యల ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇలా తమను తాము బలి చేసుకుంటున్న భర్తలంతా చదువుకున్న వారు.. మంచి స్థాయిలో ఉన్నవాళ్లే కావటం గమనార్హం. ఈ మధ్యనే బెంగళూరులో అతుల్ సుభాష్ అనే ఐటీ ఉద్యోగి.. భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక పదుల పేజీల సంఖ్యలో భార్య పెట్టే టార్చర్ మీద లేఖ రాసి మరీ సూసైడ్ చేసుకోవటం సంచలనంగా మారటమే కాదు.. దేశ వ్యాప్తంగా చర్చకు తెర తీసింది.
ఇదే కోవలో కర్ణాటకలో తిప్పన్న అనే కానిస్టేబుల్.. రాజస్థాన్ లో డాక్టర్ అజయ్ ఇలా వరుస ఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఐటీ మేనేజర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా.. భార్య పెట్టే టార్చర్ భరించలేక. పాతికేళ్ల వయసులో టీసీఎస్ లో మేనేజర్ గా వ్యవహరిస్తున్న మానవ్ శర్మ సూసైడ్ చేసుకున్నాడు.
ఫిబ్రవరి 24న తన ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవటానికి కాస్త ముందు ఆరు నిమిషాల యాభై సెకన్ల నిడివి ఉన్న ఒక వీడియోను రికార్డు చేశాడు. ఈ వీడియోలో తన వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలు.. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబందాన్ని కలిగి ఉందని.. ఇదే విషయంలో తనకు.. తన భార్యకు గొడవలు జరిగేవని వాపోయారు. ఆమె మారటం లేదని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేసిన మానవ్ శర్మ.. ఒక దశలో ఏడుస్తూ దేశంలో మహిళలను రక్షించే చట్టాలు ఉన్నట్లు.. పురుషులను రక్షించే చట్టాలు ఉండే బాగుండన్నఅభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పురుషుల గురించి ఆలోచించాలని కోర్టులను వేడుకోవటం గమనార్హం. పురుషులకు రక్షణ కల్పించకపోతే.. వారు అంతమవుతారన్న అతను.. తాను గతంలోనూ ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించినట్లుగా చెప్పాడు.
తన మణికట్టు మీద కత్తితో కోసుకున్న గుర్తుల్ని చూపించాడు. తన మరణం తర్వాత తన తల్లిదండ్రుల్ని ఇబ్బందులకు గురి చేయొద్దంటూ అర్ధిస్తూ వీడియోను ముగించాడు. ఈ వీడియో తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు సూసైడ్ చేసుకున్న ఉదంతం గురించి సమాచారం తెలుసుకున్న తర్వాత అతడి తండ్రి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. తన కొడుకు మరణానికి కోడలే కారణమని ఆరోపించారు.
అయితే.. తన భర్త ఆత్మహత్యను ఖండిస్తూ.. ‘అతడు మద్యానికి బానిస అయ్యాడు. అతిగా మద్యాన్ని సేవించి పలుమార్లు ఆత్మహత్యలకు ప్రయత్నించాడు. మూడుసార్లు నేనే రక్షించా. మద్యం సేవించిన తర్వాత నాపై దాడికి పాల్పడేవాడు. ఇదే విషయాన్ని అత్తమామలకు చెప్పినా.. వారు పట్టించుకోలేదు’ అని బాధితుడి భార్య పేర్కొన్నారు.
వీడియోలో పేర్కొన్న వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించగా.. తనకు పెళ్లికి ముందు ఒక రిలేషన్ లో ఉన్నానని.. పెళ్లి తర్వాత తన భర్తే సర్వసంగా తాను ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వాట్సాప్ చాట్ ను ఆమె బయటపెట్టారు. అందులో భర్త సోదరికి ఆమె మేసేజ్ లు ఉన్నాయి. అందులో.. ‘దీదీ, దయచేసి ఏదో ఒకటి చేయండి. తనను తాను చంపుకుంటాడు’ అని మెసేజ్ చేయగా.. అతడ్ని ఒంటరిగా ఉండనివ్వండి.. నిద్రపొండి అంటూ భర్త సోదరి ఆమెకు రిప్లై ఇచ్చినట్లుగా ఉంది. మొత్తంగా భార్య టార్చర్ భరించలేక బలవన్మరణానికి పాల్పడిన ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.