గడిచిన 18 మాసాల్లో కూటమి ప్రభుత్వం అనేక మంచి పనులు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. వీటిని ప్రజలకు వివరించే బాధ్యత కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలదే కాదని.. కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల పైనా ఉంటుందని చెప్పారు. తాజాగా రెండు రోజుల కలెక్టర్ల సదస్సును బుధవారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
గత 18 మాసాల్లో.. చేసిన పనులను ప్రజలకు వివరించే బాధ్యతను కలెక్టర్లకు కూడా ఉంటుందన్నారు. ``సూపర్ సిక్స్ను సూపర్ సక్సెస్ చేశాం.వెనుకబడిన వర్గాలను ముందుకు తేవటానికే సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చాం. సామాజిక భద్రత పెన్షన్లను మొదటి తేదీనే ఇస్తున్నాం. తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు రెండు విడతల్లో రూ.14 వేలు ఇచ్చాం. దీపం-2.0, స్త్రీశక్తి, మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా భర్తీ చేశాం. అభి వృద్ధి ఒకవైపు... సంక్షేమం మరోవైపు జరుగుతోంది. వీటన్నింటినీ మీరు కూడా ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలి`` అని చంద్రబాబు సూచించారు.
అదేవిధంగా విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.11.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. ఎస్ఐపీబీల ద్వారా రూ. 8.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించామని చెప్పారు. వీటిని సాధ్యమైనంత వేగంగా క్లియర్ చేయటంలో కలెక్టర్లు కూడా వేగంగా స్పందించాలని సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి వచ్చామన్న ఆయన.. పెట్టుబడులు పెట్టేవారికి అండగా ఉండి గౌరవించాలని పేర్కొన్నారు.
``డ్వాక్రా, మెప్మాను ఇంటిగ్రేట్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపడుతున్నాం... అందరికీ ఇళ్లు అందేలా చేస్తున్నాం. పీ4 ద్వారా పేదలకు చేయూత అందించటమే. ప్రతిపక్షాలు కూడా దీనిని అర్ధం చేసుకోవాలి. ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి సుస్థిరమైన పాలన అందిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా భారత్ గురించి ఆలోచన చేయకుండా ముందుకు వెళ్లటం లేదు. నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ, పెద్ద ఎత్తున స్థాపించిన కాలేజీల ద్వారా ఐటీ నిపుణులు వచ్చారు. వారిని సమర్ధవంతంగా వినియోగించుకోవాలి.`` అని సూచించారు.