దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అడ్వెంచరస్ థ్రిల్లర్ `వారణాసి`. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేస్తూ జక్కన్న టీమ్ చేస్తున్న ప్రమోషన్లు, హాలీవుడ్ మీడియాతో వారు పంచుకుంటున్న ముచ్చట్లు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారాయి. ఇదే సమయంలో ఈ సినిమా ప్లాట్కు సంబంధించిన ఒక సెన్సేషనల్ మ్యాటర్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే శివ భక్తుడి పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్లు స్పష్టం చేశాయి. అయితే, ఇది కేవలం ఒక సాధారణ కథ కాదు. హాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. విశ్వానికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన, పురాతనమైన ఒక వస్తువును వెతికి పట్టుకోవడమే రుద్ర మెయిన్ మిషన్. ఈ అన్వేషణలో భాగంగా కథ హిమాలయాల నుండి వారణాసి వరకు, అక్కడి నుండి గ్లోబల్ లొకేషన్ల వరకు సాగుతుందట.
రాజమౌళి ఈసారి మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ను జోడించి ఒక సరికొత్త ప్రయోగం చేస్తున్నారని తెలుస్తోంది. ఆ పురాతన వస్తువు రహస్యాన్ని ఛేదించే క్రమంలో హీరో టైమ్ ట్రావెల్ కూడా చేయాల్సి ఉంటుందని సమాచారం. పురాణాల్లోని అంశాలను ఆధునిక కాలానికి ముడిపెడుతూ జక్కన్న రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. యాక్షన్ సీక్వెన్సుల కంటే కూడా ఇందులో ఉండే మైండ్ గేమ్ ఆడియన్స్కు సరికొత్త అనుభూతిని ఇస్తుందని టాక్.
కథలో అసలైన ట్విస్ట్ విలన్ ఎంట్రీతో మొదలవుతుందట. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ `కుంభా` అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్లాన్ చేసే కుంభాకు, ధర్మాన్ని కాపాడే రుద్రకు మధ్య జరిగే ఈ పోరాటం ఊహాతీతంగా ఉంటుందట. హీరో మేధస్సుకు, విలన్ క్రూరత్వానికి మధ్య జరిగే ఈ యుద్ధంలో వచ్చే మలుపులు వెండితెరపై గూస్బంప్స్ తెప్పిస్తాయని సమాచారం.