గత కొంతకాలంగా తాను పార్టీ మారినట్లు జరుగుతున్న ప్రచారంపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎట్టకేలకు మౌనం వీడారు. తన రాజకీయ భవిష్యత్తు మరియు పార్టీ మార్పుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనేనని, తన నిబద్ధతను చాటుతూ కీలక ఆధారాలను కూడా బయటపెట్టారు.
తాను బీఆర్ఎస్ పార్టీకి ఎంత విధేయుడో చెప్పడానికి తన జీతం వివరాలను ఆయన ప్రస్తావించారు. ``ప్రతి నెలా నా జీతం నుండి రూ.5 వేలు బీఆర్ఎస్ పార్టీ ఫండ్కు కట్ అవుతున్నాయి. గత ఏడాది మార్చి వరకు పార్టీ ఫండ్ నిరంతరాయంగా వెళ్లింది. ఆ తర్వాత వారే స్వయంగా ఆపేశారు. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని అఫిడవిట్ కూడా ఇచ్చాను`` అని సంజయ్ కుమార్ వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఉదంతంపై మాట్లాడుతూ.. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే తాను ముఖ్యమంత్రిని కలిశానని తెలిపారు. ఆ సమయంలో సీఎం మర్యాదపూర్వకంగా శాలువా కప్పారు. శాలువా కప్పితే పార్టీలో చేరినట్లు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండానే మీడియాలో అసత్య ప్రచారం చేశారని, దీనివల్ల తన ఆసుపత్రి వద్ద గొడవలు కూడా జరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, సంజయ్ కుమార్ తో సహా 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ వేయగా.. ఇప్పటి వరకు స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. తాజాగా సంజయ్ కుమార్ విషయంలో ఇదే రిపీట్ అయింది. ఆయన పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో సంజయ్ కుమార్కు సాంకేతికంగా పెద్ద ఊరట లభించినట్లయింది. అయితే, స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు కేపీ వివేకానంద వంటి వారు తీవ్రంగా మండిపడుతున్నారు.