దేవుళ్ల విషయంలో హిందువులు అనుసరిస్తున్న వైఖరిపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ మతంలో అయినా.. తమ తమ దేవుళ్లను అవమానిస్తే.. ఐక్యంగా వారంతా ఒకే తాటిపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తారని తెలిపారు. ఇది వారి భక్తికి నిదర్శనంగా.. ఆ దేవుడి పట్ల విశ్వాసంగా భావిస్తారని పేర్కొన్నారు. అందుకే.. ఇతర మతాలకు చెందిన దేవుళ్లపై విమర్శలు చేసేందుకు ఎవరూ సాహసించరని తెలిపారు.
కానీ, హిందువులు మాత్రం అలా లేరని పవన్ పేర్కొన్నారు. హిందువులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నార ని తెలిపారు. దేవుళ్లను అపవిత్రం చేసినా.. వారిని అవమానించినా.. హిందువులు మౌనంగా ఉంటున్నార ని పేర్కొన్నారు. ``ఏదైనా జరిగితే.. వారి ఖర్మకు వారే పోతారన్న భావన హిందువుల్లో ప్రబలంగా నెలకొంది. దీంతో హిందూ దేవుళ్లను లక్ష్యంగా చేసుకుని చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వైఖరి కారణం గానే హిందువుల్లో ఐక్యత కూడా దెబ్బతింది`` అని వ్యాఖ్యానించారు.
హిందువుల్లో ఉన్న ఈ ఉదాశీన వైఖరిపోవాలని.. హిందువులు మారాలని.. మార్పు కనిపించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మనం పూజించుకునే దేవుళ్లకు చిన్న అపకారం తలపెట్టినా.. ఉపేక్షించరాదని తెలిపారు. హిందువులు అందరూ ఐక్యంగా ఉంటే.. దేవుళ్లకు ఎలాంటి ఇబ్బందులు రావని తెలిపారు. ఈ విషయంపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని ఆయన కోరారు. సనాతన హిందూ ధర్మంపై అనాదిగా దాడి జరుగుతూనే ఉందని.. ఒకప్పుడు ఆలయాలను కూలగొడితే.. ఇప్పుడు మరో రూపంలో దాడి జరుగుతోంద న్నారు. దీనిని ప్రతిఘటించేందుకు హిందువుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఎందుకు?
పవన్ కల్యాణ్ ఇలా పిలుపునివ్వడం వెనుక.. రీజనేంటి? అనేది ఆసక్తిగా మారింది. పైకి ఆయన నేరుగా చెప్పకపోయినా.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. వైసీపీ నాయకులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. ఏకసభ్య కమిషన్ను కూడా ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. అయినప్పటికీ.. హిందూ ధార్మిక సంఘాలు.. హిందూ మఠాధిపతులు ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.