తమిళనాడు ఎన్నికల ఏడాదిలో మారుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. మాజీ సిఎం జయలలిత మరణం తర్వాత డీలా పడ్డ అన్నాడిఎంకేని ఏకతాటిపై నడిపించడంలో మాజీ సిఎం పళని స్వామి సక్సెస్ అవుతున్నారు. అన్ని పార్టీలను ఇండియా కూటమికి వ్యతిరేకంగా ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు పళని. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కో పార్టీని ఎన్డియే కూటమిలోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో రెండు పార్టీలు పళని నాయకత్వానికి జై కొట్టాయి.
ఎన్డీఏ కూటమిలో పీఎంకే, ఏఎంఎంకే, తమిళ మానయ కాంగ్రెస్, పురచ్చి భారతం, జాన్ పాండియన్, ఫార్వర్డ్ బ్లాక్, పుతియా నీతి పార్టీ, ఐజేకే వంటి పార్టీలు తమిళనాడు ఎన్డియే కూటమిలో ఇప్పటికే చేరగా.. ఇప్పుడు మరో రెండు పార్టీలు చేరాయి. కొంగు ప్రోగ్రెస్ పార్టీ, కొంగునాడు ప్రోగ్రెస్ పార్టీలు కొంగు ప్రాంతంలో కీలకంగా ఉన్నాయి. ఆ రెండు పార్టీలు సేలంలో పళని స్వామిని కలిసి తమ మద్దతు లేఖలు అందించాయి. దీనితో గత ఎన్నికల మాదిరిగానే కొంగు నాడు ప్రాంతం అన్నాడిఎంకేకి అండగా నిలబడే సంకేతాలు కనపడుతున్నాయి.
సినీ నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడంతో తమిళనాట గెలుపు ఓటముల మధ్య పెద్ద తేడా ఉండే అవకాశం కనపడటం లేదు. దీనితో ఏ చిన్న అవకాశాన్ని ప్రధాన పార్టీలు వదులుకోవడం లేదు. తాజాగా పుతియా తమిళనాడు, డీఏండీకే పార్టీలతో అన్నాడిఎంకే నాయకత్వం వేగవంతం చేసింది. ఆ రెండు పార్టీలు దాదాపుగా కూటమిలో చేరే అవకాశం ఉంది. ఇక డెల్టా ప్రాంతంలో కీలకంగా ఉన్న తమిళ దేశం పార్టీ సిఎం స్టాలిన్ కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.