వైసీపీ అధినేత జగన్ గురించి.. కూటమి పార్టీల నాయకులు భయపడిపోతున్నారంటూ.. పెద్ద ఎత్తున వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాల్లో వార్తలు.. రీల్స్ వస్తున్నాయి. ప్రధానంగా జగన్ మరోసారి అధికారంలోకి వచ్చేస్తారేమో.. అన్న బెంగ కూటమి పార్టీలను వెంటాడుతూనే ఉందని ఈ కథనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆన్లైన్ చానెల్ ప్రజల మధ్యకు వెళ్లింది. ప్రజలనాడి ఎలా ఉంది? నిజంగానే.. కూటమి నాయకులు భయపడుతున్నారన్న వాదన సరైందేనా? అనే విషయాలపై ఆరా తీసింది.
దీనిలో ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్తావించింది. ప్రజలు ఈ అంశాలపై ఏమనుకుంటున్నారు? జగన్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? అనే కీలక విషయాలపై సర్వే చేపట్టింది. దీని ప్రకారం.. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాచ్ చిత్రంగా ఉంది. నాలుగు అంశాల్లో.. 1) జగన్ వైఖరి: ఈ విషయంలో ప్రజలు 2024 ఎన్నికల సమయంలో ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారని చెబుతున్నారు. జగన్ వైఖరిలో మార్పు రాలేదని.. ఆయనంటే భయంగానే ఉందని 70 శాతం మంది చెప్పారు.
2) పథకాలు: వాస్తవానికి జగన్ నమ్ముకున్నది సంక్షేమ పథకాలనే . ఇవే తనను మరోసారి అందలం ఎక్కిస్తాయని ఆయన అనుకుంటున్నారు. కానీ, ప్రజల్లో ఆ తరహా ఆలోచన లేదు. రాష్ట్రం అప్పుల పాలవు తున్నప్పుడు.. ఉచితాలు ఎందుకని మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. నగరాలు, పట్టణాల్లోని వారు ఉచితాలకు వ్యతిరేకంగా ఈ సర్వేలో తమ వాదన వినిపించారు. సో.. దీనిని బట్టి జగన్ కు సంక్షేమం సాయం చేయదని తెలుస్తోంది.
3) వైసీపీ నేతల తీరు: ఈ విషయంపై దాదాపు 80 శాతం మంది సర్వేలో పాల్గొన్న వారు.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులను వైసీపీ నాయకులు ఇంకా దూషి స్తున్నారని.. ఇది సరికాదని చెప్పుకొచ్చారు. అదేసమయంలో నాయకులపై విశ్వసనీయత కూడా పెద్దగా లేదని అంటున్నారు. 4) కూటమి పాలన: పాలనపై 65 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉద్యోగాలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాల విషయంపై మెజారిటీ ప్రజలు సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం.