దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. ఆదివారం(ఫిబ్రవరి 22) దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని కమలం పార్టీ జాతీయ నాయకత్వం పిలుపునిచ్చింది. దీనికి బీజేపీ మిత్రపక్షాలు కూడా కలిసి రావాలని పేర్కొంది. అయితే.. బీజేపీలో మిత్రపక్షం కానప్పటికీ.. వైసీపీ అధినేత జగన్ రియాక్ట్ అయ్యారు. బీజేపీ నిరసనలకు తమ పార్టీ తరఫున మద్దతు ఇస్తున్నామన్నారు.
ఎందుకీ నిరసన!
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఏఐ ఇంపాక్ట్ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తలు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. ప్రపంచ దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన ప్రముఖుల ముందే.. చొక్కాలు తీసి.. అర్థనగ్న ప్రదర్శన చేశారు. అమెరికాతో కేంద్ర ప్రభుత్వం లాలూచీ పడిందని.. దేశ భద్రత నుంచి అన్ని రంగాల్లోనూ అమెరికా ఒత్తిడికి తలొగ్గిందని పేర్కొంటూ.. నినాదాలు చేశారు.
ఈ ఘటన దేశంలో సంచలనంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పటియాలా పోలీసులు.. నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారంతా జైల్లో ఉన్నారు. దీనిని నిరసిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు కౌంటర్గా బీజేపీ కూడా దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే జగన్ స్పందించడం గమనార్హం.
దేశం కోసమే: వైసీపీ
ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక సదస్సుకు.. ప్రపంచ దేశాల నుంచివందలాది మంది ప్రతినిధులు హాజరయ్యారని.. వారి ముందు ఇలా నిరసనకు దిగడం సరికాదని.. జగన్ పేర్కొన్నారు. ఏదైనా ఉంటే.. కేంద్రంతో చర్చించుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. దేశ ప్రతిష్ఠను మంటగలిపే ఇలాంటి చర్యలను అందరూ ఖండించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. మంత్రి నారా లోకేష్ కూడా.. బీజేపీకి మద్దతు పలికారు. కాంగ్రెస్ యువ నాయకులు నిరసన తెలపడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.