ప్రజాప్రతినిధుల మధ్య బంధం..వారి కుటుంబాల మధ్య కూడా అనుబంధంగా ఏర్పడటానికి ఆత్మీయ సమ్మేళనం వేదికైంది. కర్నూలు, నరసరావుపేట పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు గురువారం ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ విందు ఏర్పాటు చేశారు. ఆత్మీయ కలయిక ఫ్యామిలీ గెట్ టుగెదర్ ని తలపించింది. నేతల కుటుంబసభ్యులు పరస్పరం పరిచయం చేసుకున్నారు.
సరదా సంభాషణలతో ఆహ్లాదకర వాతావరణంలో గడిపారు. పొలిటికల్ లైఫ్ నుంచి కాస్త రిలీఫ్ గా డిన్నర్ మీటింగ్ సాగింది. పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడ సెటిల్ అయ్యారంటూ లోకేష్ అడిగి తెలుసుకున్నారు. 25 ఏళ్లకు అబ్బాయిలకు పెళ్లి చేయాలని, తనకు 24 ఏళ్లకే పెళ్లయ్యిందని లోకేష్ చెప్పారు. 25 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని దేవాన్ష్ ను కూడా ఇప్పటి నుంచే ట్యూన్ చేస్తున్నానన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం నేతలు తనకు ఇచ్చిన దరఖాస్తుల్లో ఎన్ని పరిష్కారం అయ్యాయి? పరిశీలనలో ఏం ఉన్నాయి? ఏవి కాలేదు అనేవి తెలియజేసే నివేదికను ఆయా నేతలకు అందజేశారు. మహిళామణులకు మంగళగిరి పట్టుచీరలు పెట్టారు. విందు ముగిశాక గేటు వరకూ వెళ్లి అందరికీ ఆత్మీయ వీడ్కోలు పలికి సాగనంపారు.
ఈ ఆత్మీయ సమ్మేళనానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు మంత్రి టీజీ భరత్ (కర్నూలు), పివి పార్థసారధి (ఆదోని), కేఈ శ్యాంబాబు (పత్తికొండ), బొగ్గుల దస్తగిరి (కోడుమూరు), బివి జయనాగేశ్వరరెడ్డి (ఎమ్మిగనూరు), ఎమ్మెల్సీ బీటీ నాయుడు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు (వినుకొండ), భాష్యం ప్రవీణ్ (పెదకూరపాడు), పత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట), చదలవాడ అరవింద్ బాబు (నరసరావుపేట), కన్నా లక్ష్మీనారాయణ (సత్తెనపల్లి), యరపతినేని శ్రీనివాసరావు (గురజాల), జూలకంటి బ్రహ్మారెడ్డి (మాచర్ల), ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కుటుంబసభ్యులతో హాజరయ్యారు.