మధ్యప్రాచ్య రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసింది. మూడు దశాబ్దాలకు పైగా ఇరాన్ అనే దేశాన్ని తన కనుసన్నలతో శాసించిన సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త మెరుపు దాడుల్లో హతమయ్యారనే వార్త ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అయితే, ఒక దేశాధినేత మరణిస్తే ఆ దేశం శోకసంద్రంలో మునిగిపోవాలి.. కానీ, ఇరాన్లోని కొన్ని వీధుల్లో మాత్రం బాణాసంచా పేలుతోంది, ప్రజలు మిఠాయిలు పంచుకుంటున్నారు. అసలు ఈ వైరుధ్యానికి కారణమేంటి? ఖమేనీ ఒక విప్లవ వీరుడా లేక తన సొంత ప్రజలకే రాక్షసుడిగా మారారా?
ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అధ్యక్షుడు ఉంటారు కానీ, అసలైన అధికారం మాత్రం సుప్రీం లీడర్ దగ్గరే ఉంటుంది. 1989లో ఇరాన్ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన ఖమేనీ, కేవలం మతగురువుగానే కాకుండా దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు మరియు అణు కార్యక్రమాలపై సర్వాధికారిగా ఎదిగారు. ఆయన మద్దతుదారులు ఆయనను పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని ఎదిరించిన `ఇస్లామిక్ హీరో`గా ఆరాధిస్తారు. అమెరికాను `సైతాన్`గా అభివర్ణిస్తూ, ఇజ్రాయెల్ ఉనికిని సవాల్ చేస్తూ ఆయన సాగించిన రాజకీయం ఒక వర్గం ప్రజల్లో ఆయనను తిరుగులేని నాయకుడిని చేసింది.
అయితే, నాణేనికి మరో పార్శ్వం ఉంది. ఖమేనీ పాలనలో ఇరాన్ ఆర్థికంగా చితికిపోయింది. అంతర్జాతీయ ఆంక్షలు ఒకవైపు, దేశంలో పెరుగుతున్న నిరంకుశత్వం మరోవైపు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ముఖ్యంగా మహసా అమీనీ మరణం తర్వాత మొదలైన హిజాబ్ నిరసనలను ఖమేనీ ప్రభుత్వం అత్యంత క్రూరంగా అణచివేసింది. వేలమంది యువతను జైళ్లకు పంపడం, బహిరంగంగా ఉరిశిక్షలు అమలు చేయడం వంటి చర్యలు సాధారణ ప్రజల్లో ఆయనపై తీవ్ర ఆగ్రహాన్ని పెంచాయి. అందుకే, ఆయన మరణవార్త వినగానే చాలామంది ఇరాన్ పౌరులు తమకు విముక్తి లభించిందని భావిస్తూ వీధుల్లో సంబరాలు చేసుకుంటున్నారు.
అమెరికా కక్షకు అసలు కారణం ఇదే!
అమెరికాకు ఖమేనీ అంటే దశాబ్దాల నాటి పగ. దీనికి ప్రధాన కారణం మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రయోజనాలను ఆయన దెబ్బతీయడమే. లెబనాన్లోని హిజ్బుల్లా, గాజాలోని హమాస్ వంటి సాయుధ గ్రూపులకు వెన్నుదన్నుగా నిలుస్తూ అమెరికా, ఇజ్రాయెల్లకు నిద్రలేకుండా చేశారు ఖమేనీ. ఇరాన్ అణు బాంబు తయారు చేస్తే అది ప్రపంచానికే ముప్పు అని అమెరికా భావించింది. అందుకే, ట్రంప్ వంటి నాయకులు ఖమేనీని `చరిత్రలోనే అత్యంత క్రూరుడు`గా అభివర్ణించారు.
ఖమేనీ మరణంతో ఇరాన్ ఇప్పుడు ఒక క్లిష్టమైన మలుపులో ఉంది. ఆయన వారసుడిగా ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ వస్తారా? లేక ప్రజలు ఈ అవకాశాన్ని వాడుకుని ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థనే కూల్చేస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనా, ఒక చేత్తో మూడు దశాబ్దాల పాటు ఇరాన్ను శాసించిన ఖమేనీ ప్రస్థానం రక్తసిక్తంగా ముగిసిందనేది మాత్రం వాస్తవం.