యువ కథానాయకుడు శ్రీవిష్ణు(hero sri Vishnu) సినిమాలు రెండు ఒక్క రోజు వ్యవధిలో రిలీజ్కు రెడీ అయిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందులో ఒక సినిమా ‘మృత్యుంజయ్’ వారం వాయిదా పడడం విష్ణుకు ఉపశమనమే. ‘మృత్యుంజయ్’ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ శనివారానికి అనుకున్న ‘విష్ణు విన్యాసం’(Vishnu vinyasam movie) చిత్రాన్ని ఒక రోజు ముందుకు జరిపారు.
ఐతే రెండు సినిమాలను హడావుడిగా ఇంత తక్కువ గ్యాప్లో రిలీజ్ చేయాలనుకోవడం ఎందుకో అర్థం కాలేదు. అనివార్య పరిస్థితుల్లోనే ఇలా జరిగిందని అర్థమైంది. అది ఓటీటీ డీల్స్ వల్లే అయి ఉండొచ్చని అంతా అనుకన్నారు. కానీ ‘విష్ణు విన్యాసం’ ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఒకదాంట్లో విష్ణు మాట్లాడుతూ.. దీనికి వేరే కారణం ఉందని, ఇప్పుడు చెబితే పబ్లిసిటీ స్టంట్ అనుకుంటారని.. రిలీజ్ తర్వాత విషయం వెల్లడిస్తానని చెప్పాడు. ఐతే విష్ణు చెప్పకముందే టాలీవుడ్ సర్కిల్స్లో దీని గురించి చర్చ జరుగుతోంది.
‘విష్ణు విన్యాసం’ హడావుడి రిలీజ్కు ఒక కుట్ర కారణమని సమాచారం. టీంలోనే ఒకరు ఫస్టాఫ్ను లీక్ చేశారని.. అది చెన్నైకి చెందిన పైరసీ బ్యాచ్ చేతికి చిక్కిందని.. వాళ్లు నిర్మాతను డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారని తెలుస్తోంది. డబ్బులు ఇవ్వకుంటే ఫస్టాఫ్ను ఆన్ లైన్లో లీక్ చేసేస్తాం అని బెదిరించారట. ఈ పరిస్థితుల్లో టీం హడావుడిగా బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసి సడెన్గా సినిమాను రిలీజ్కు చేశారట. పైరసీ మాఫియా ఒత్తిళ్లకు లొంగకుండా, వారికి చెక్ పెట్టేలా ‘విష్ణు విన్యాసం’ సినిమాను కొంచెం హడావుడిగానే రిలీజ్ చేసేశారట. అందుకే ఈ సినిమాను వాయిదా వేయలేని పరిస్థితుల్లో ‘మృత్యుంజయ్’ చిత్రాన్ని వెనక్కి తీసుకెళ్లారట.
లీక్, పైరసీ వ్యవహారం గురించి ‘విష్ణు విన్యాసం’ టీం ప్రెస్ మీట్ పెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. హడావుడి షూటింగ్ వల్ల సెకండాఫ్ ఔట్ పుట్ కూడా దెబ్బ తిన్నట్లుగా యూనిట్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. నిన్న రిలీజైన ‘విష్ణు విన్యాసం’ డివైడ్ టాకే తెచ్చుకుంది. ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో విమర్శలు తప్పట్లేదు.