సీనియర్ రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (ex central minister kavuri sambasivarao)(82) నిన్న కన్నుమూశారు(died). మార్చి 7న బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన సాంబశివరావు హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 5 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు నేడు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వం తరఫున అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.
ఆయన మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సాంబశివరావుకు భార్య హేమలత, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తన తాత మృతిపై విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీ భరత్ సంతాపం వ్యక్తం చేశారు. సాంబశివరావు కూతురి తనయుడైన శ్రీ భరత్ తన తాత రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సాంబశివరావు చెరగని ముద్ర వేశారు. వ్యాపారవేత్త అయిన కావూరి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. సీనియర్ నేతగా ఢిల్లీ స్థాయిలో ఆయనకు మంచి పేరు ఉండేది. 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయన ఎన్నో విజయాలు సాధించారు. కాంగ్రెస్ తరపున 5 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 1984, 1989, 1998లో మచిలీపట్నం ఎంపీగా..2004, 2009లో ఏలూరు ఎంపీగా విజయం సాధించారు.