మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను తుపానును సృష్టిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ (MP Putta Mahesh Kumar), తనపై వస్తున్న వార్తలపై ఎట్టకేలకు మౌనం వీడారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని భావించిన ఆయన, టీడీపీ అధిష్ఠానం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు రాతపూర్వక వివరణ ఇచ్చారు. ఈ వివరణలో ఆయన వినిపించిన వాదన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
తనపై వస్తున్న డ్రగ్స్ ఆరోపణలను ఎంపీ పుట్టా మహేశ్ కుమార్(Putta Mahesh) తీవ్రంగా ఖండించారు. తాను కేవలం డిన్నర్ ఆహ్వానం మేరకే ఆ ప్రాంతానికి వెళ్లానని, అక్కడ జరుగుతున్న ఇతర వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. `` నేను కేవలం అతిథిగా వెళ్లాను, అక్కడ ఎలాంటి నిషేధిత పదార్థాలు తీసుకోలేదు`` అని ఆయన తన రిప్లైలో పేర్కొన్నట్లు సమాచారం. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కొందరు కుట్ర పూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు సీరియస్.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?
పార్టీ ప్రతిష్ట విషయంలో ఏమాత్రం రాజీపడని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు, ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. పార్టీ క్యాడర్కు తప్పుడు సంకేతాలు వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఎంపీకి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ ఇచ్చిన వివరణపై ప్రస్తుతం పార్టీ అంతర్గత క్రమశిక్షణా కమిటీ సమీక్ష నిర్వహిస్తోంది. పుట్టా మహేశ్ వివరణతో అధిష్ఠానం సంతృప్తి చెందుతుందా? లేక లోతైన విచారణ జరిపి కఠిన చర్యలకు మొగ్గు చూపుతుందా? అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.
ఈ కేసు కేవలం ఒక ఎంపీకే పరిమితం కాలేదు. తెలంగాణ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి(Pilot Rohit Reddy) పేరు కూడా ఈ జాబితాలోకి చేరడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఆయనకు కూడా బీఆర్ఎస్ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో, ఈ డ్రగ్స్ కేసు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్గా మారింది. రోహిత్ రెడ్డి ఇంకా తన వివరణ ఇవ్వాల్సి ఉంది.