న్యాయస్థానాల్లో శిక్షలు పడే సందర్భాలు కొన్ని సిత్రంగా ఉంటాయి. కోర్టులు చట్టాలు..ఆధారాలు.. సాక్ష్యాలకు అనుగుణంగా నడుస్తుంటాయి. ప్రజల మేలు కోసం.. వారికి మరింత మెరుగైన జీవనం కోసం పోరాటం చేసినా..కొన్ని సందర్భాల్లో శిక్షలు తప్పవు. ఇప్పుడు అలాంటి అనుభవాన్నే ఎదుర్కొంటున్నారు వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్(ycp ex minister gudiwada amarnath). ఆయనకు ఆర్నెల్లు జైలు(6 months jail).. జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ ఉదంతంలో గుడివాడకు ప్రజల్లో సానుభూతి పెరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆయన తనకు తానుగా చేసిన నేరం.. ప్రజల అవసరాలకు.. వారికి మరింత మెరుగైన పరిస్థితుల సాధన కోసం చేసిన పోరాటం ఆయనకు జైలుశిక్షగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే.. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలని కోరుతూ 2016 ఏప్రిల్ లో గుడివాడ ఆందోళనలు చేపట్టారు.
ఇందులో భాగంగా అప్పట్లో స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
ఈ ఉదంతం ఆయన్ను అప్పట్లో ప్రజానేతగా మార్చింది. ప్రజల కోసం పోరాటం చేసిన ఆయనపై అప్పట్లో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ తాజాగా కోర్టులో జరిగింది. ఇది పూర్తైన నేపథ్యంలో న్యాయమూర్తి తీర్పును వెలువరించారు.
విచారణలో తమకు వరకు వచ్చిన ఆధారాలు.. సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం గుడివాడకు ఆర్నెల్లు జైలుశిక్ష... రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. విశాఖ రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పుపై స్పందించిన అమర్ నాథ్.. తాను హైకోర్టుకు అప్పీలుకు వెళతానని ప్రకటించారు. అప్పట్లో రైల్వే జోన్ కోసం తాము చేసిన పోరాటం వల్లే ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ వచ్చిందంటూ.. సదరు క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవటం గమనార్హం