దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు యుద్ధ ప్రాతిప దికన ముందుకు కదిలింది. వచ్చే 2029 నాటికి ఎట్టి పరిస్థితిలోనూ నియోజకవర్గాలను పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే .. సంప్రదాయంగా ప్రతి 10-15 ఏళ్లకు ఒకసారి అవసరం ఉన్న చోట నియోజకవర్గాలను పెంచుతారు. కానీ, దీనికి భిన్నంగా ఇప్పుడు 50 శాతం మేరకు నియోజకవర్గాలను పెంచేందుకు కేంద్రం సన్నద్ధమైంది. దీనికి సంబంధించి అన్ని పార్టీలను, ప్రభుత్వాలను కూడా కేంద్రం అభ్యర్థించింది.
రేవంత్ అభ్యంతరం?
ఇలా నియోజకవర్గాల పెంచడంపై.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గుండుగుత్తగా నియో జకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలునష్టపోతాయన్నది సీఎం వాదన. అలా కాకుం డా.. రాష్ట్రాల స్థూల ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని దాని ప్రకారం.. నియోజకవర్గాలను పెంచాలని ఆయన కోరుతున్నా రు. అంతేకాదు.. ఈ ఫార్ములానే అభివృద్ధికి మూల మంత్రమని కూడా చెబుతున్నారు. గుడ్డిగా నియోజకవర్గాలను పెంచడం సరికాదన్నది రేవంత్ వాదన. అయితే.. ఈ విషయం పెద్దగా చర్చకు రావడం లేదు.
ఏంటీ ఫార్ములా?
సీఎం రేవంత్ రెడ్డి వాదనలో బలమైన వ్యూహం.. ఆర్థిక వెసులుబాటు. ఒక నియోజకవర్గం పెరిగితే.. తదనుగుణంగా.. ప్రభుత్వా లపై భారం పెరుగుతుంది. ఎమ్మెల్యే, ఎంపీలు పెరుగుతారు. వారికి వేతనాలు, భత్యాలు, వసతి సౌకర్యాలు సహా.. పించన్ల వంటివి ప్రభుత్వాలకు ఆర్థిక భారంగా మారుతాయి. అదేసమయంలో నియోజకవర్గం పెరిగినప్పుడు సహజంగానే ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యతకూడా పెరుగుతుంది. కానీ, ఇవన్నీ తీర్చేందుకు సర్కారు వద్ద నిధుల సమస్య ప్రధానంగా తెరమీదికి వస్తుంది.
ప్రస్తుత పరిస్థితిలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు గ్రాంట్లలో కోత పడింది. అంతేకాదు.. ఇన్సెంటివ్స్ను అసలు ఎత్తేశారు. అదేసమయం లో మీరు అప్పులు చేసుకుంటే.. మేం ప్రోత్సహిస్తాం.. అనే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఫలితంగా దాదాపు అన్ని రాష్ట్రాలుకూడా అప్పులు చేసుకోకతప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్తగా నియోజకవర్గాలు ఏర్పడితే. అది మరింత భారంగా మారనుంది. పైగా జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే.. ప్రయోజనం కూడా తక్కువేనన్నది సీఎం రేవంత్ ఆలోచనగా ఉంది.
ఈ నేపథ్యంలోనే ఆయన జీఎస్డీపీ(రాష్ట్రాల స్తూల ఉత్పత్తి) ఆధారంగా నియోజకవర్గాలను పెంచాలని కోరుతున్నారు. తద్వారా ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, తక్కువగా ఉన్న రాష్ట్రాల వారీగా నియోజవర్గాల సంఖ్య ఏర్పడుతుంది. ఇది సర్కారుకు ఒకింత మేలు కలుగుతుంది. పైగా ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ఈ ఫార్ములానే ఇప్పుడు సీఎం రేవంత్ ప్రతిపాదించారు. కానీ.. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చేసింది. దేశంలో ఉన్న అన్ని నియోజకవర్గాలను దాదాపు 50 శాతం మేరకు పెంచాలని నిర్ణయించింది.
ఇదీ పాయింటు..
జనాభా ప్రాతిపదికన జరుగుతున్న ప్రస్తుత డీలిమిటేషన్ ద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో 600 పార్లమెంటు స్థానాలు ఏర్పడనున్నాయి. అలా కాకుండా.. ఆదాయం ఆధారం చేసుకుని డీలిమిటేషన్ చేపడితే.. దక్షిణాది రాష్ట్రాలకు సంఖ్య పెరుగుతుంది. అందుకే.. ఆదాయం ఆధారంగా డీలిమిటేషన్ చేయాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారు.