వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితిలోనూ జనసమ్మర్థ ప్రాంతాలైన.. పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, ఆలయాలు.. బహిరంగ ప్రదేశాలు.. క్రీడా మైదానాల్లో వీధి కుక్కలుకనిపించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయితే.. గతంలోనే ఇచ్చిన ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ.. వన్య ప్రాణి ప్రేమికులు భారీ ఎత్తున పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని కోరారు.
అయితే.. తీర్పును పునః పరిశీలించేందుకు ససేమిరా అన్న సుప్రీంకోర్టు.. తాజాగా మరో సంచలన ఆదేశం ఇచ్చింది. వీధి కుక్కల విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాల్లో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసిన న్యాయస్థానం.. రెబీస్ వ్యాధి సోకిన.. అదేవిధంగా రేచు కుక్కల విషయంలో జాలిదయ చూపించాల్సిన అవసరం లేదని పేర్కొంది. సమాజానికి, ప్రజలకు భయంకరమైన సవాల్ రువ్వుతున్న అలాంటి కుక్కలను చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇలా.. కుక్కలను చంపేయాలని ఆదేశించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించుకుంది. ఈ సందర్భంగా సమాజానికి హానికరంగా ఉన్న కొన్ని సంస్థలను నిషేధిస్తున్నామన్న(ఉదాహరణకు మావోయిస్టులు) విషయాన్ని పిటిషనర్లు గుర్తుంచుకోవాలని పేర్కొంది. కుక్కల కారణంగా రెబీస్ సోకి బాధపడుతున్నవారు.. చనిపోయిన వారి కుటుంబాల రోదనను ఎవరూ తీర్చలేరని.. అలాంటప్పుడు కుక్కల విషయంలో జాలి పడి సమాజానికి మనం మేలు చేస్తున్నామా? కీడు చేస్తున్నామా? అనేది ఆలోచన చేయాలని సూచించింది.
ఇక, వీధి కుక్కలను తరలించాలని.. వాటికి ప్రత్యేక ఆవాసాలు ఏర్పాటు చేయాలని తాము గతంలో ఇచ్చి న ఆదేశాలను రాష్ట్రాలు కూడా పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు.. రోడ్లపై నడిచి వెళ్తే.. తప్ప కుక్కల సమస్య తెలిసేలా లేదని వ్యాఖ్యానించింది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది. ఒకవీధిలో కుక్కలను పట్టుకుని తీసుకువెళ్లి వేరే చోట వదిలేయడమే కాదని.. అవి మళ్లీ జనావాసాల్లోకి రాకుండా కూడా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉంటుందని పేర్కొంది.