ఏపీలో సుపరిపాలన సాగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2024లో కూటమిగా వచ్చిన తమకు ప్రజలు ఘన విజయం అందించారని తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించారని.. అందుకే కూటమి పార్టీలు.. 100 శాతం స్ట్రయిక్ రేట్తో విజయం దక్కించుకున్నా యని తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అప్పులు-అరాచకాలు-ఆర్థిక విధ్వంసం.. గొడ్డలి పార్టీ క్రెడిట్లుగా చంద్రబాబు పేర్కొన్నారు. చివరకు రాష్ట్రా న్ని పూర్తిగావిధ్వంసం చేశారని.. ఇది మనకు ఎప్పుడూ గుర్తుండాల్సిన అవసరం ఉందన్నారు. 2019-24 మధ్య ఐదేళ్ల సమయాన్ని మనం పోగొట్టుకున్నామని.. అప్పుడు కూడా గెలిచి ఉంటే.. రాష్ట్రం ఈపాటికే అభివృద్ది చెంది ఉండేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రాజధాని అమరావతి నుంచి పోలవరం వరకుఅన్ని ప్రాజెక్టులు ఉరుకులు పరుగులు పెడుతున్నాయని తెలిపారు.
గత రెండేళ్లలో సామాజిక భద్రతా పింఛన్లను ఇంటికే అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సూపర్ సిక్స్ హామీలను సంపూర్ణంగా అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందు కు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలను బలపేతం చేస్తున్నామన్నారు. రెండు సంవత్సరాల్లోనే 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి 13 లక్షల ఉద్యోగాలను కల్పించామన్నారు.
రాయలసీమకు రాయల్ ఎన్ఫీల్డ్ను తీసుకువచ్చి.. రతనాల సీమ చేస్తున్నామన్నారు. 2001లో మోడీ గుజరాత్ముఖ్యమంత్రి అయ్యారని, సుస్థిర ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు కొనసాగించారని తెలిపారు. అలానే.. 2014లో దేశానికి ఆయన ప్రధాని అయ్యారని.. సుస్థిర పాలనను అందిస్తున్నారన్నారు. అలానే ఏపీలో కూడా సుస్థిర ప్రభుత్వం కొనసాగాలని తెలిపారు. తిరుమల లడ్డూపవిత్రతను కాపాడామని చెప్పారు. వైసీపీ పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. బ్రిటీష్ వారు కూడా తిరుమల జోలికి పోలేదన్న చంద్రబాబు.. వైసీపీ పాలకులు తిరుమలను కూడా నాశనం చేశారని వ్యాఖ్యానించారు.