గత ఏడాది పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో గాయపడ్డ ఆమె తనయుడు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఈ క్రమంలోనే ఆ ఘటనకు సంబంధించి టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పై గతంలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆ కేసు విచారణకు నేడు వర్చువల్ పద్ధతిలో అల్లు అర్జున్ హాజరయ్యారు.
ముంబైలో షూటింగ్ లో ఉన్న అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టులో జరుగుతున్న విచారణకు హాజరయ్యారు. బన్నీ విచారణ కేవలం ఒక నిమిషం పాటు మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసు తదుపరి విచారణ జూలై 6వ తేదీకి వాయిదా వేశారు. అయితే, ఒక నిమిషం పాటు మాత్రమే విచారణ జరగడంతో బన్నీ విచారణకు గైర్హాజరయ్యారని, దీంతో, జూలై 6న తప్పకుండా విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించిందని ప్రచారం జరుగుతోంది. కానీ, బన్నీ విచారణకు హాజరయ్యారు.