మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. రిపబ్లిక్ టీవీ నిర్వహించిన 'రిపబ్లిక్ సమ్మిట్' లో పాల్గొన్న లోకేష్ ఆ తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ నిర్వహించిన 'ఎక్స్ప్రెస్ అడ్డా' కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏపీలో డిజిటల్ మౌలిక వసతులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), యువతకు ఉపాధి అవకాశాలు, మరియు రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు.
విశాఖపట్నాన్ని గ్లోబల్ ఐటీ హబ్గా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని, భవిష్యత్తులో రాబోయే భారీ పెట్టుబడుల గురించి లోకేష్ వివరించారు. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ ను ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు లోకేష్ చమత్కార ధోరణిలో బదులిచ్చారు. రాజకీయాల్లో ట్రోల్స్ను తాను సానుకూలంగా తీసుకుంటానని, రాహుల్ గాంధీ తర్వాత అత్యధికంగా ట్రోల్ అయ్యే వ్యక్తిని తానేనని సరదాగా వ్యాఖ్యానించారు.
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని, నమో అంటే నాయుడు మోడీ అని లోకేష్ చెప్పారు. రియల్ టైం గవర్నెన్స్ అనే శాఖను కూడా లోకేష్ చూసుకుంటున్నారని వ్యాఖ్యాత ప్రశ్నించగా దేశంలో తొలిసారిగా ఈ విధంగా ఏపీలో జరుగుతోందని లోకేష్ బదులిచ్చారు. యువత రాజకీయాల్లోకి రావాలని, ఏపీలో పాలనా సంస్కరణలు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని లోకేష్ పిలుపునిచ్చారు.