విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ అదృశ్యం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపిన సంగతి తెలిసిందే. కాపు యువకుడు సాయికృష్ణను పోలీసులు లాక్ అప్ డెత్ చేశారని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఘటనపై సమగ్ర విచారణ కోసం సిట్ ను కూడా సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సీట్ అధికారులు ఆ వ్యవహారంలో విచారణ జరుపుతున్నారు.
అయితే కాపు యువకుడి మిస్సింగ్ ఉదంతంపై పవన్ కళ్యాణ్ స్పందించలేదని కొందరు విమర్శలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల మధ్య మనస్పర్ధలు సృష్టించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటువంటి నేతలకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు.
రామలక్ష్మణుల్లాంటి చంద్రబాబు-పవన్ జోడీని విడగొట్టడం ఎవరి తరం కాదని ఆయన అన్నారు.రామలక్ష్మణుల్లా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసున్నంత కాలం ఏపీలో ఆ గొడ్డలి పార్టీకి చోటు లేదని అన్నారు. అందుకే కూటమిని దెబ్బతీయడానికి పులివెందుల సంస్కృతిని తెరపైకి తెచ్చి పవన్ ని, కాపులను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ కబంధ హస్తాల్లో బందీలుగా ఉన్న కొంతమంది కాపు నేతల మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని అన్నారు. కాపులకు చంద్రబాబు ఇచ్చిన 5% రిజర్వేషన్ను జగన్ రద్దు చేసినప్పుడు మీరంతా ఎక్కడ? అని ప్రశ్నించారు. నాడు జగన్ రద్దు చేస్తే నోరు మెదపని వాళ్ళు.. నేడు నీతులు చెబుతాయా? అని నిలదీశారు.