ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ ట్విస్ట్ వస్తుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంత పాలిటిక్స్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన హీట్ ఉంటుంది. మొన్నటికి మొన్న ఒంగోలు సీనియర్ లీడర్ బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన కండువా కప్పుకుని రీజినల్ పాలిటిక్స్ను ఒక్కసారిగా వేడెక్కించారు. ఇప్పుడు సరిగ్గా అదే బాటలో ప్రకాశం జిల్లాకు చెందిన మరో మాస్ లీడర్ అమంచి కృష్ణమోహన్(Amanchi Krishna Mohan) కూడా గ్లాస్ అందుకోవడానికి సిద్ధమవుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో గట్టి టాక్ వినిపిస్తోంది. బాలినేని ఫాలో అయిన రూట్ మ్యాప్నే అమంచి కూడా ఎంచుకోవడంతో ఈ ప్రాంతంలో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి.
అమంచి కృష్ణమోహన్ అంటే కేవలం ఒక లీడర్ మాత్రమే కాదు.. చీరాల, బాపట్ల పరిసర ప్రాంతాల్లో సొంతంగా కేడర్ను, బలమైన సామాజిక వర్గ మద్దతును తిప్పుకోగల సత్తా ఉన్న నాయకుడు. పార్టీల జెండాలతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో ఒంటిచేత్తో పట్టు సాధించిన హిస్టరీ ఆయనది. అయితే గత కొంతకాలంగా సరైన పొలిటికల్ ప్లాట్ఫారమ్ లేక ఆయన అనుచరవర్గం సైలెంట్గా ఉండిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న ఆయన ఇప్పుడు జనసేన(Janasena) వైపు అడుగులు వేస్తుండటంతో, ఆయన కేడర్లో మళ్లీ కొత్త జోష్ కనిపిస్తోంది. అమంచి ఎంట్రీ ఇస్తే చీరాల అసెంబ్లీ స్థానంలోనే కాకుండా బాపట్ల లోక్సభ పరిధిలో కూడా జనసేన టాప్ గేర్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేనను తిరుగులేని శక్తీగా మార్చాలనేది పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే జిల్లా వ్యాప్తంగా క్రేజ్, అంగబలం, అర్థబలం ఉన్న సీనియర్లను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే బాలినేని రాకతో ఒంగోలు పరిసరాల్లో జనసేన గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు చీరాల నుంచి అమంచి కృష్ణమోహన్, గిద్దలూరు నుంచి అమంచి స్వాములు వంటి నేతలు జతకూడితే.. జిల్లాలో జనసేన కూటమికి డబుల్ బూస్ట్ దొరికినట్లే. ఒకప్పుడు ప్రకాశం జిల్లా అంటే వైఎస్సార్ కాంగ్రెస్ లేదా టీడీపీకి అడ్డాగా ఉండేది. కానీ ఇప్పుడు బాలినేని, అమంచి లాంటి కింగ్ మేకర్లు జనసేన గూటికి చేరుతుండటంతో.. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ మార్క్ పాలిటిక్స్ నడవబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.