70 సార్లు దొంగతనమా.. అయోధ్యలో ఏం జ‌రుగుతోంది..?

admin
Published by Admin — June 27, 2026 in National
News Image

కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవం, దేశవ్యాప్త భక్తుల నమ్మకానికి నిలువెత్తు రూపం అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir). బాలరాముడి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ, తమ శక్తానుసారం హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. అయితే, భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించిన ఈ సొమ్ముపై కొందరు కేటుగాళ్ల కన్ను పడింది. సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ, వాటి కళ్లు గప్పి మరీ పక్కా ప్లాన్‌తో దోపిడీకి పాల్పడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? అంతటి పవిత్ర స్థలంలో ఇంతటి అపచారం ఎలా సాధ్యమైంది?

సాధారణంగా ఇలాంటి పవిత్ర క్షేత్రాల్లో భద్రత అడుగడుగునా ఉంటుంది. దేవుడి సొమ్మును లెక్కించే చోట ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. కానీ, ఇక్కడే నిందితులు తమ తెలివితేటలను ప్రదర్శించారు. డబ్బులు లెక్కించే సమయంలో ఒకరు కావాలనే కెమెరాకు అడ్డంగా నిలబడేవారు. ఆ నీడను ఆసరాగా చేసుకుని మిగిలినవారు హుండీలోని నగదును, విలువైన ఆభరణాలను నొక్కేసేవారు. అలా దొంగిలించిన సొమ్మును ఎవరికీ అనుమానం రాకుండా దుస్తుల్లో దాచుకుని, ఆ తర్వాత స్నానాల గదుల్లో భద్రపరిచేవారు. సమయం చూసి దాన్ని బయటకు దాటించి, అందరూ పంచుకునేవారట.

ఈ దోపిడీ ఏదో ఒకట్రెండు రోజుల్లో జరిగింది కాదు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) జరిపిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 మధ్య.. అంటే కేవలం 40 రోజుల వ్యవధిలోనే ఏకంగా 70 సార్లు ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. హుండీలోని నగదు మాత్రమే కాదు, బ్యాంకులకు తరలించే సమయంలోనూ కొంత మొత్తాన్ని దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి దాదాపు రూ.80 లక్షల వ‌ర‌కు నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు భక్తులు సమర్పించిన ముక్కుపుడకలు, గాజులు, కాలి గజ్జెలు వంటి బంగారు, వెండి ఆభరణాల లెక్కల్లోనూ తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ స్కామ్ వెలుగులోకి రావడంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌లో తీవ్ర కలకలం రేగింది. అరెస్టయిన వారిలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ మాజీ డ్రైవర్ కూడా ఉండటంతో ఆరోపణలు తీవ్రమయ్యాయి. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ చంపత్‌రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు, ఈ అంశంపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల ప్రసాదం వివాదం మరువక ముందే, అయోధ్యలో ఇలాంటి ఘోరం జరగడంపై హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) దీనిపై స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసిన ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి అపచారాలు జరగకుండా ఉంటాయనడంలో సందేహం లేదు.

Tags
Ayodhya Ram Mandir Ram Mandir Ayodhya Donation Theft Yogi Adityanath SIT Ayodhya PM Modi
Recent Comments
Leave a Comment

Related News