సంచలన వ్యాఖ్యలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) చుట్టూ ఇప్పుడు లీగల్ ఉచ్చు బిగుసుకుంటోంది. నిత్యం పదునైన విమర్శలతో వార్తల్లో నిలిచే ఆయన, ఈసారి ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే పరిస్థితి తలెత్తేలా కనిపిస్తోంది. హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసేలా, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఆయన వ్యవహరిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు ప్రకాశ్ రాజ్పై పోలీస్ కేసు పెట్టడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
కదిరి పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ ఫిర్యాదులో ప్రకాశ్ రాజ్పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కేవలం సమాజాన్ని విడదీసేలా మాట్లాడటమే కాకుండా.. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)లను టార్గెట్ చేస్తూ వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా వెనుక ఉండి నడిపిస్తున్నది ప్రకాశ్ రాజేనని కమలనాథులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వివాదాస్పద శక్తులకు మద్దతు ఇస్తూ దేశ వ్యతిరేక ధోరణిని ప్రోత్సహిస్తున్న ప్రకాశ్ రాజ్ను వెంటనే అరెస్ట్ చేయాలనే డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది.
ఈ వివాదం అంతటితో ఆగకుండా రాజకీయ రంగు పులుముకుంది. దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న ప్రకాశ్ రాజ్కు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారంటూ వైసీపీ(YCP), సిపిఐ, సిపిఎం పార్టీలపై విష్ణువర్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంలో ఆయా పార్టీల స్టాండ్ ఏంటో స్పష్టం చేయాలని, వెంటనే హిందూ సమాజానికి ప్రకాశ్ రాజ్తో పాటు సదరు పార్టీలు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రకాశ్ రాజ్ వెనుక ఉండి నడిపిస్తున్న అదృశ్య శక్తుల గుట్టు రట్టు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు తీవ్రతను బట్టి చూస్తే ప్రకాశ్ రాజ్కు అరెస్ట్ ముప్పు తప్పదా? అనే చర్చ సర్వత్రా నడుస్తోంది.