ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులపై మాజీ సీఎం జగన్ అలసత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే, 2024లో సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత పోలవరం పనులు పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది ఆగస్టు 14న పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను విడుదల చేసే చరిత్రాతమ్మ ఘట్టానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు.
2019 నాటికి పోలవరం ప్రాజెక్టులో 72 శాతం పనులు తమ ప్రభుత్వం పూర్తి చేసిందని, కానీ, ఆ తర్వాత ఐదేళ్లలో కేవలం 2 శాతం పనులు మాత్రమే జరిగాయని ఆరోపించారు. ఆ ప్రాజెక్టుపై గత పాలకుల కక్ష సాధింపు, ఏజెన్సీలను మార్చడం, పీపీఏ సూచనలను పెడచెవిన పెట్టడం వంటి చర్యల వల్ల ప్రాజెక్టు భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగువ కాఫర్ డ్యామ్లో ఖాళీలు వదిలేయడం వల్ల వచ్చిన వరదలకు రూ.440 కోట్లతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ విషయం గుర్తించి మరమ్మతులు చేపట్టడంలో జగన్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. కాబట్టే దానికి సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ను రూ.990 కోట్ల అదనపు వ్యయంతో యుద్ధప్రాతిపదికన నిర్మించాల్సి వచ్చిందని అన్నారు. అందుకే, ప్రాజెక్టు పనుల్లో మరింత జాప్యం జరిగిందని వివరించారు. స్పిల్వే, రేడియల్ గేట్లు, కాఫర్ డ్యామ్ పనులు పూర్తయ్యాయని, 50 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా గేట్లను ఏర్పాటు చేశామని చెప్పారు.