ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్బ్రాండ్ నాయకుడిగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) వ్యూహాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. కేడర్లో జోష్ నింపేందుకు, అధినాయకత్వం దృష్టిలో పడేందుకు ఆ పార్టీ నేతలు రకరకాల దారులు వెతుకుతున్నారు. అయితే, అంబటి రాంబాబు ఎంచుకున్న పంథా మాత్రం తీవ్ర విమర్శలపాలవుతోంది. ప్రజా సమస్యలపై గళమెత్తడం పక్కన పెట్టి, శాంతిభద్రతలను కాపాడే పోలీసులను టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
తాజాగా కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) అంత్యక్రియల వేళ జరిగిన ఉదంతం అంబటి రాజకీయ శైలికి అద్దం పడుతోంది. అక్కడ తీవ్ర శోకసంద్రం నెలకొన్న వేళ, విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో అంబటి ఘర్షణకు దిగడం సంచలనం సృష్టించింది. అంత్యక్రియల సమయం కావడంతో పోలీసులు సంయమనం పాటిస్తున్నప్పటికీ.. అంబటి మాత్రం కావాలనే రెచ్చగొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తున్న పోలీసులను నెట్టివేయడం, దురుసుగా ప్రవర్తించడంతో ఆయనపై ఏఆర్ ఎస్సై అప్పలరాజు, కానిస్టేబుళ్లు ఫిర్యాదు చేశారు. దీంతో కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో అంబటిపై BNS 132, 3(5) వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
అయితే ఈ కేసుల వెనుక అంబటి రాంబాబు పక్కా పొలిటికల్ స్కెచ్ ఉందనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న వేళ.. పోలీసులపై తిరగబడి, కేసులు పెట్టించుకుని, అవసరమైతే జైలుకు వెళ్లడం ద్వారా వైఎస్సార్సీపీ(YSRCP)లో హీరో ఇమేజ్ తెచ్చుకోవాలని ఆయన భావిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జైలుకెళ్తే వచ్చే సానుభూతితో అటు అధిష్టానం నమ్మకాన్ని, ఇటు సోషల్ మీడియాలో మైలేజ్ను ఒకే దెబ్బకు సొంతం చేసుకోవచ్చనే భ్రమల్లో ఆయన ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో గుంటూరులో కూడా పోలీసులను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన ప్రదర్శనలు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఒక సీనియర్ లీడర్ అయి ఉండి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సింది పోయి.. కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల కోసం పోరాడి మైలేజ్ తెచ్చుకుంటే అది పార్టీకి, నాయకుడికి బలాన్ని ఇస్తుంది. కానీ, విధి నిర్వహణలో ఉండే పోలీసులను బలిపశువులను చేస్తూ ఇలాంటి విలనిజం ప్రదర్శిస్తే, అది చివరికి సెల్ఫ్ గోల్ లా మారి అంబటి(Ambati) రాజకీయ భవిష్యత్తును డిఫెన్స్లో పడేసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.