వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి, పలాస నేత సీదిరి అప్పలరాజు(Seediri Appalaraju) రాజకీయ జీవితం ఇప్పుడు అత్యంత క్లిష్టమైన మలుపు తిరిగింది. ఒక రోడ్డు ప్రమాదం ఆయన మెడకు చుట్టుకుంది. అతివేగం, నిర్లక్ష్యంతో బైక్ నడిపి ఒకరి ప్రాణం తీసిన కేసులో తన కుమారుడు ఆరవ్ వర్మను రక్షించుకునేందుకు అప్పలరాజు వేసిన ఎత్తుగడలు ఇప్పుడు ఆయనకే ఎదురుతిరిగాయి. చట్టాన్ని తప్పుదోవ పట్టించి, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే బలమైన ఆధారాలు లభించడంతో మాజీ మంత్రి చుట్టూ పోలీస్ ఉచ్చు బిగుస్తోంది.
సాధారణంగా రోడ్డు ప్రమాద కేసుల్లో బెయిల్ సులభంగానే దొరుకుతుంది. కానీ, ఈ కేసులో సీదిరి అప్పలరాజు అడ్డదారులు తొక్కడం వల్లే పరిస్థితి జైలు వరకు వెళ్ళేలా చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత అసలు నిందితుడు తన కుమారుడు కాదనేలా సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ తారుమారు వ్యవహారంలో కీలక ఆధారాలు దొరకడంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని 61(2), 238, 240, 242, 249 వంటి కఠినమైన సెక్షన్ల కింద అప్పలరాజుపై కేసు నమోదు చేశారు.
ఈ మొత్తం కేసులో అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ(Aarav Varma) మొదటి నిందితుడు (A1) కాగా, అనుచరుడు సిద్ధార్థ త్యాడి ద్వితీయ నిందితుడు (A2) గా ఉన్నాడు. వీరిద్దరినీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఈ కేసులో మూడో నిందితుడు (A3) గా ఉన్న మాజీ మంత్రి అప్పలరాజును కూడా ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పలరాజు కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు, ఆయనను అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం పలాస నియోజకవర్గంలో ఈ అరెస్టుల వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ప్రమాదానికి సరిగ్గా రెండు రోజుల ముందే ఆరవ్ వర్మకు అత్యంత వేగంగా ఎల్ఎల్ఆర్ (LLR) జారీ కావడం వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్పై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. చట్టపరమైన అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అప్పలరాజు ఇప్పటికే తన న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కుమారుడిని కాపాడుకోవాలనే అత్యుత్సాహం ఒకప్పటి పవర్ఫుల్ మంత్రిని ఇప్పుడు నిందితుడి సీట్లో నిలబెట్టింది.