నిన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా కేవలం వ్యంగ్యాస్త్రాలు, మీమ్స్కే పరిమితమైన ఒక పేరు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీని గజగజలాడిస్తోంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) వివాదం కాస్తా దేశ రాజకీయాల్లో ఊహించని సంచలనానికి తెరలేపింది. 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) పేరిట పుట్టుకొచ్చిన ఈ యువజన, విద్యార్థి చైతన్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నిద్రలేకుండా చేస్తోంది. దేశ రాజధాని వీధుల నుంచి మొదలైన ఈ ఉద్యమ జ్వాలలు ఇప్పుడు గల్లీల దాకా పాకి, మోదీ పీఠాన్ని కదిలించే స్థాయికి చేరుతున్నాయి.
ప్రారంభంలో కేవలం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) రాజీనామాను, బాధ్యులపై కఠిన చర్యలను మాత్రమే డిమాండ్ చేసిన విద్యార్థి నాయకులు, ఇప్పుడు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామానే లక్ష్యంగా పోరాటాన్ని ఉధృతం చేశారు. 'నీట్' పరీక్ష కేంద్రంగా చోటుచేసుకున్న అక్రమాలు, అక్రమార్కుల లీలలు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ఆందోళనలోకి నెట్టడమే కాకుండా, మోదీ సర్కార్కు రాజకీయంగా కోలుకోలేని దెబ్బగా మారాయి. ఢిల్లీలో ఊపందుకున్న ఈ ఆందోళనలకు మద్దతుగా హైదరాబాద్ వంటి నగరాల్లోనూ భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు మిన్నంటుతున్నాయి.
ఉద్యమాన్ని తొక్కిపెట్టేందుకు పోలీసులు ప్రయోగిస్తున్న బలప్రయోగాలు, లాఠీఛార్జీలు ఈ నిరసనల తీవ్రతను మరింత పెంచుతున్నాయే తప్ప తగ్గించడం లేదు. పోలీసులు తగ్గేదేలే అంటుంటే, విద్యార్థులు అంతకంటే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు తమ రాజకీయ చదరంగంలో ప్రత్యర్థుల నోళ్లకు తాళాలు వేస్తూ ఏకచక్రాధిపత్యాన్ని చెలాయించిన బీజేపీ(BJP)కి, ఇప్పుడు బొద్దింక గుర్తుతో సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఈ బలమైన ప్రతిఘటన ఊహించని షాక్ అనే చెప్పాలి.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న నీట్ వివాదం ఇప్పుడు మోదీ(Modi) సర్కార్ పాలిట అతిపెద్ద రాజకీయ పరీక్షగా పరిణమించింది. విద్యార్థులకు ఫెయిల్ అయితే రీ-ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది కానీ, ప్రభుత్వాలకు ప్రతిసారీ రీ-ఎలక్షన్లు ఉండవు. ఈ ఉద్యమం గనుక ఇలాగే ముదిరితే, ఇప్పటివరకు పటిష్టంగా ఉన్న బీజేపీవ్యతిరేక శక్తులన్నింటికీ ఇది కొత్త నైతిక బలాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఈ చైతన్యం రాజకీయ శక్తిగా మారితే, దేశంలో ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తై బీజేపీకి సవాల్ విసిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.