ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయ పీఠంపై దశాబ్దాలుగా నడిచిన సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ అధికార, ప్రతిపక్షాల మధ్య పోరు అంటే కేవలం చంద్రబాబు నాయుడు వర్సెస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే కోణంలోనే ప్రజలు చూస్తూ వచ్చారు. అయితే కాలం మారుతున్న కొద్దీ రాజకీయాల్లోనూ కొత్త అధ్యాయాలు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో బాబు స్థానాన్ని మంత్రి నారా లోకేష్ క్రమంగా తన వైపునకు తిప్పుకుంటున్నారు. వైసీపీ కూడా వ్యూహాత్మకంగా తమ ప్రధాన టార్గెట్ను చంద్రబాబు నుంచి లోకేష్ వైపునకు మళ్లిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
తాజాగా జరిగిన పరిణామాలు ఈ కొత్త శకానికి సంపూర్ణ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒకే రోజు అటు మీడియా ఎదుట జగన్(Jagan), ఇటు సోషల్ మీడియా వేదికగా లోకేష్ పరస్పరం విసురుకున్న సవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలే సృష్టించాయి. మెగా డీఎస్సీ అంశాన్ని తెరపైకి తెచ్చి జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తే, లోకేష్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా అంతే ధీటుగా స్పందించారు. కేవలం విమర్శలతో సరిపెట్టకుండా, "చేతనైతే నన్ను ఆపండి చూద్దాం" అంటూ లోకేష్ విసిరిన డైరెక్ట్ ఛాలెంజ్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
ఈ వీడియో బైట్లో లోకేష్(Lokesh) వ్యవహరించిన తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ను అత్యంత హుందాగా సంబోధిస్తూనే, తన పాలనా విధానాన్ని, డీఎస్సీ నిర్వహణ వెనుక ఉన్న యువగళం పాదయాత్ర జ్ఞాపకాలను ఆయన పంచుకున్నారు. రాజకీయ శత్రుత్వం వేరు, ప్రజా సమస్యల పరిష్కారం వేరు అన్నట్లుగా ఆయన మాట్లాడిన విధానం టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఈ ఇద్దరు నేతల మధ్యే ప్రధాన పోరు నడవనుందనడానికి ఈ పరిణామాలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి.
కాగా, టీడీపీ(TDP) భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా లోకేష్ ఇప్పటికే పార్టీలోనూ, ప్రజల్లోనూ బలమైన ముద్ర వేసుకున్నారు. మరోవైపు జగన్ కూడా తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో రానున్న రోజుల్లో ఏపీ పాలిటిక్స్ ‘జగన్ వర్సెస్ లోకేష్’ అనే సరికొత్త యాక్సిస్ చుట్టూ తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. పాత తరపు పోరు ముగిసి, సరికొత్త రాజకీయ రణరంగం తెరపైకి వస్తున్న తరుణంలో.. ఈ యంగ్ అండ్ మాస్ వార్ ఏపీ రాజకీయాలను ఏ వైపునకు తీసుకువెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.