వైఎస్ కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆమె గారాలపట్టి వైఎస్ అంజిలి రెడ్డి వివాహం వైభవంగా నిశ్చయమైంది. డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో అంజిలి రెడ్డి ఏడడుగులు వేయబోతున్నారు. ఈ శుభవార్తను షర్మిల స్వయంగా ప్రజలతో పంచుకుంటూ, తన కుటుంబంలో రాబోయే వేడుకల వివరాలను అధికారికంగా ప్రకటించారు.
గురువారం ఉదయం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు తీసుకునేందుకు షర్మిల కుటుంబ సమేతంగా ఇడుపులపాయ చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్(YSR) ఘాట్ను సందర్శించి.. తొలి వివాహ ఆహ్వాన పత్రికను సమాధి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఈ సందర్భంగా షర్మిల ఆకాంక్షించారు. తమ నాన్న దివెనలతోనే ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ఇక ఈ వేడుకలకు సంబంధించిన ముహూర్తాలను షర్మిల స్వయంగా వెల్లడించారు ఈ నెల 24న అత్యంత వేడుకగా నిశ్చితార్థం జరగనుండగా.. నవంబర్ 25న వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. అలాగే డిసెంబర్ 5న నూతన వధూవరుల రిసెప్షన్ వేడుకను ప్లాన్ చేసినట్లు ఆమె తెలిపారు. కాగా, వైఎస్ కుటుంబం(YS Family)లో జరుగుతున్న ఈ వేడుక పట్ల రాజకీయ ప్రముఖులు, అభిమానులు నూతన వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. షర్మిల ఇంట పెళ్లి సందడి మొదలుకావడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ట్రెండింగ్గా మారింది.