ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గృహ ప్రవేశం చేస్తున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా ఆయన కొత్త ఇంట్లోకి అడుగు పెట్టనున్నారు. అదే.. ఆయన సొంత నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో గత 2023లో ప్రారంభించిన సొంతిల్లు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు, మంత్రులు కూడా చంద్రబాబును ఎద్దేవా చేశారు. 35 ఏళ్లుగా నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నా.. చంద్రబాబుకు ఇక్కడ సొంతిల్లు అంటూ లేదని అప్పట్లో మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డి వంటివారు విమర్శించారు.
ఈ క్రమంలోనే 2023లో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు.. కుప్పంలో స్థలం కొనుగోలు చేసి.. వైసీపీ హయాంలోనే భూమి పూజ నిర్వహించారు. ఆతర్వాత వడివడిగా పనులు ముందుకుసాగాయి. చిత్రంఏంటంటే.. ఈ ఇంటికి వైసీపీ హయాంలోనే అనుమతులు రావడం. ఇక, ఆ తర్వాత నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిరంతరం ఈ ఇంటి నిర్మాణాన్ని పర్యవేక్షించారు. అధునాతన వసతులు.. పెద్ద ఎత్తున కారు పార్కింగ్, గెస్టులు వస్తే.. ఉండేందుకు వసతులతో కూడిన ఈ ఇంటి నిర్మాణం గత నెలలోనే పూర్తయింది.