ఏపీలో సోషల్ మీడియా బ్యాన్.. నారా లోకేష్ కొత్త వ్యూహం!

admin
Published by Admin — January 22, 2026 in Politics, Andhra
News Image

నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే ముద్ద దిగని పరిస్థితి. పెద్దల సంగతి పక్కన పెడితే, చిన్నారులు సోషల్ మీడియా మాయలో పడి తమ బాల్యాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ దిశగా అడుగులు వేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో అమలులో ఉన్న నిబంధనలను రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టేలా సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన సోషల్ మీడియా నిబంధనలను ఏపీ స‌ర్కార్ రోల్ మోడల్‌గా తీసుకుంటోంది. చిన్న వయస్సులో పిల్లలకు ఇంటర్నెట్‌లో దొరికే మంచి, చెడులను విశ్లేషించే పరిణతి ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం ఎదురయ్యే సైబర్ బుల్లీయింగ్, అశ్లీలత మరియు అనవసరమైన పోలికల వల్ల చిన్నారులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ డిజిటల్ వ్యసనం వారి చదువుల మీద మాత్రమే కాకుండా, వ్యక్తిత్వ వికాసం మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు.
 
పిల్లల వయస్సును ఖచ్చితంగా నిర్ధారించే ఏజ్ వెరిఫికేషన్ టెక్నాలజీని ఎలా వాడాలి, సోషల్ మీడియా సంస్థలు ఈ నిబంధనలను పాటించేలా ఎలా ఒత్తిడి తీసుకురావాలి అనే అంశాలపై ఐటీ శాఖ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. నిబంధనలను ఉల్లంఘించే ప్లాట్‌ఫారమ్‌లపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టపరమైన వెసులుబాటును ప్రభుత్వం పరిశీలిస్తోంది. చిన్నారుల ఆన్‌లైన్ భద్రత విషయంలో ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించడం ద్వారా, దేశంలోనే ఏపీని ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలపాలని నారా లోకేష్ భావిస్తున్నారు. ఇక ఈ నిర్ణయం అమలులోకి వస్తే అది రాష్ట్రంలోని లక్షలాది మంది చిన్నారుల భవిష్యత్తును మార్చే అవకాశం ఉంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags
Andhra Pradesh Nara Lokesh Social Media Ban Child Safety AP Government TDP
Recent Comments
Leave a Comment

Related News