కర్ణాటక `రాజసం` యూపీ అసెంబ్లీకి.. ఒక్క కుర్చీ ధర రూ. 30 లక్షలా?

admin
Published by Admin — February 02, 2026 in Politics, National
News Image

సాధారణంగా ఒకే రకమైన దుస్తులు లేదా కార్లు కొనడం మనం చూస్తుంటాం. కానీ, ఒక రాష్ట్ర అసెంబ్లీలోని స్పీకర్ కుర్చీని చూసి ముచ్చటపడి, మరో రాష్ట్ర స్పీకర్ సరిగ్గా అలాంటి కుర్చీనే తయారు చేయించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటక అసెంబ్లీలోని స్పీకర్ కుర్చీ రాజసం చూసి ఫిదా అయిన ఉత్తరప్రదేశ్ స్పీకర్ సతీశ్ మహానా, సుమారు రూ. 30 లక్షలు వెచ్చించి మరీ అచ్చం అలాంటి కుర్చీనే తన కోసం సిద్ధం చేయించుకున్నారు.

తేడాది బెంగళూరులో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో పాల్గొన్నప్పుడు సతీశ్ మహానా కన్ను కర్ణాటక స్పీకర్ కుర్చీపై పడింది. ఆ కుర్చీ ఎత్తు, దానిపై ఉన్న కళాత్మక చెక్కడాలు ఆయనను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వెంటనే కర్ణాటక స్పీకర్ యు.టి. ఖాదర్‌ను ఆ కుర్చీ విశేషాల గురించి ఆరా తీశారు. యూపీ అసెంబ్లీలో కూడా అలాంటి గంభీరమైన కుర్చీ ఉండాలని తన కోరికను వెల్లడించారు.

పదిమంది కళాకారులు.. రెండు నెలల శ్రమ! 
సతీశ్ మహానా కోరిక మేరకు స్పీకర్ ఖాదర్ స్వయంగా చొరవ తీసుకుని, మైసూరుకు చెందిన నిపుణులైన కళాకారులను పురమాయించారు. రోజ్‌వుడ్‌తో (కలప) తయారైన ఈ కుర్చీని తీర్చిదిద్దేందుకు పదిమంది కళాకారులు దాదాపు రెండు నెలల పాటు రేయింబవళ్లు శ్రమించారు. 7.5 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో తయారైన ఈ కుర్చీపై గొడుగు వంటి ఆకారం, సింహం మరియు ఏనుగు బొమ్మలను ఎంతో కళాత్మకంగా చెక్కారు.

చిన్నపాటి డిజైన్ మార్పులతో, ఉత్తరప్రదేశ్ రాజముద్రను జోడించి సిద్ధం చేసిన ఈ కుర్చీ ఇప్పటికే లక్నోకు పయనమైంది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న యూపీ బడ్జెట్ సమావేశాల నాటికి ఈ కుర్చీ అసెంబ్లీలో కొలువుదీరనుంది. దీంతో అటు కర్ణాటక, ఇటు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలలో ఒకే తరహా వైభవం కనిపించబోతోంది. రూ. 30 లక్షల ఖర్చుతో తయారైన ఈ కుర్చీ ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

Tags
Uttar Pradesh Karnataka UP Assembly Vidhan Sabha Satish Mahana Indian Politics
Recent Comments
Leave a Comment

Related News