అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే మరో రాజకీయ సంగ్రామానికి రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడానికి సమయం దగ్గరపడింది. మున్సిపాలిటీలు, పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు వరుసగా ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. వేసవి ఎండల కంటే ముందే రాజకీయ సెగలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం మార్చి 17తో ముగియనుంది. ఆ వెంటనే ఏప్రిల్ 4న సర్పంచ్ల పదవీకాలం, జూన్ నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇప్పటికే జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ వేగవంతం కావడంతో, ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
బాబు వ్యూహం.. పాత తప్పు రిపీట్ కాకుండా!
2018లో చంద్రబాబు నాయుడు స్థానిక ఎన్నికల నిర్వహణలో చేసిన జాప్యం 2019 సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఆ తప్పు మళ్ళీ జరగకూడదని ఈసారి కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కూటమిపై ప్రజల్లో ఉన్న సానుకూలతను ఓట్లుగా మార్చుకోవాలని, వైసీపీ కోలుకోకముందే క్షేత్రస్థాయిలో పట్టు సాధించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే జనగణన ప్రక్రియ కంటే ముందే ఈ ఎన్నికలను పూర్తి చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోతే కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి ఈ నిధులు అత్యంత కీలకం. అందుకే రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించి, నిధులను రాబట్టడం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఓటమి నుంచి ఆ పార్టీ శ్రేణులు ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఇలాంటి సమయంలో ఎన్నికలు వస్తే కేడర్ను సమన్వయం చేసుకోవడం జగన్కు సవాలుతో కూడుకున్న పని.