దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అరుదైన మరియు ఆసక్తికర సన్నివేశం జరిగింది. రాజకీయ చాణక్యుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఒకే ఫ్రేమ్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిన్న అర్ధరాత్రి వేళ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ సర్ప్రైజ్ మీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చుని ఎంపీలతో అత్యంత కీలకమైన అంశాలపై ఆయన చర్చిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అదే ఎయిర్పోర్ట్లో ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు ఒక విషయం తెలిసింది. లాంజ్లో చంద్రబాబు ఉన్నారని తెలియగానే, సచిన్ ఏమాత్రం సంకోచించకుండా నేరుగా బాబు ఉన్న చోటుకు వెళ్లి సర్ప్రైజ్ చేశారు.
తను ఉన్న చోటుకే క్రికెట్ దిగ్గజం సచిన్ రావడంతో చంద్రబాబు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇద్దరు దిగ్గజాలు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకరు రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న విజనరీ, మరొకరు ప్రపంచ క్రికెట్ను శాసించిన ఛాంపియన్. వీరిద్దరూ కాసేపు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవడం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. చంద్రబాబు పాలనా దక్షత పట్ల సచిన్ తనకున్న గౌరవాన్ని ఈ సందర్భంగా చాటుకున్నారు.
ఈ భేటీ అనంతరం చంద్రబాబు తన అధికారిక నివాసానికి వెళ్లగా, సచిన్ ముంబైకి ప్రయాణమయ్యారు. అయితే, ఈ కలయికపై సచిన్ స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ``చంద్రబాబు గారిని కలవడం గొప్ప అనుభూతి. ఆయన ఆయురారోగ్యాలతో, ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను`` అంటూ సచిన్ తన ఎక్స్ వేదికగా ఫొటోలను షేర్ చేయడంతో.. ``టూ లెజెండ్స్ ఇన్ వన్ ఫ్రేమ్`` అంటూ నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు.