అమరావతి: ఏపీ రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ.. అమరావతి వేదికగా మళ్ళీ ఆ పాత `హైటెక్` రోజులు కనిపిస్తున్నాయి. ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నేడు అమరావతిలో అడుగుపెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్న గేట్స్కు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఘనస్వాగతం పలికారు. ఈ కలయిక కేవలం మర్యాదపూర్వకమైనది మాత్రమే కాదు, ఏపీ భవిష్యత్తును మార్చే ఒక బిగ్ మాస్టర్ ప్లాన్ అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ బృందం, చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అయిన రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఎస్) ను సందర్శించింది. టెక్నాలజీని ఉపయోగించి పరిపాలనను ప్రజల వద్దకు ఎలా తీసుకెళ్లవచ్చో చూసి గేట్స్ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. డేటా విశ్లేషణ, పర్యవేక్షణ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను బాబు స్వయంగా వివరించారు.
సంజీవని ప్రాజెక్ట్: బాబు వేసిన స్కెచ్ మామూలుగా లేదుగా!
ఈ పర్యటనలో ప్రధానంగా చర్చకు రాబోయే అంశం `సంజీవని ప్రాజెక్ట్`. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడమే దీని ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, తల్లీబిడ్డల ఆరోగ్యంపై బిల్ గేట్స్తో బాబు కీలక చర్చలు జరపనున్నారు. వీటితో పాటు ఏపీలో వ్యవసాయం, విద్యారంగాల్లో టెక్నాలజీని జొప్పించి, పేదరికాన్ని నిర్మూలించే దిశగా గేట్స్ ఫౌండేషన్ భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా, గతంలో హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన చంద్రబాబు, ఇప్పుడు అమరావతిని `గ్లోబల్ హబ్`గా మార్చేందుకు బిల్ గేట్స్ వంటి దిగ్గజాల సహకారం కోరడం ఆయన రియల్ గేమ్ ప్లాన్లో భాగమేనని స్పష్టమవుతోంది. మొత్తానికి బిల్ గేట్స్ పర్యటనతో ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ పూర్వవైభవం రాబోతోందని అర్థమవుతోంది.