ఇచ్చిన మాటకు కట్టుబడితే మార్పు ఎలా వస్తుందో చూపించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తన ఇంటి పేరునే ఊరి పేరుగా కలిగిన `కొణిదెల` గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆయన, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆ పల్లె ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. పవన్ మార్క్ డెవలప్మెంట్తో ఇప్పుడు ఆ గ్రామం నవకళను సంతరించుకుంది.
సాధారణంగా నాయకులు దత్తత తీసుకుంటే ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూస్తారు. కానీ, పవన్ కల్యాణ్ శైలి వేరు. గతేడాది నందికొట్కూరు పర్యటనలో ఉన్నప్పుడు గ్రామస్తుల విన్నపాన్ని మన్నించి, తన సొంత సంపాదన నుండి రూ. 50 లక్షల విరాళాన్ని తక్షణమే ప్రకటించారు. ఆ నిధులతో ఇప్పుడు 90 వేల లీటర్ల సామర్థ్యం గల భారీ ఓవర్హెడ్ ట్యాంకును నిర్మించి, గ్రామంలో దశాబ్దాలుగా ఉన్న తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపారు. ఈ ట్యాంకు ఇప్పుడు ఆ ఊరి అభివృద్ధికి ఒక చిహ్నంగా నిలుస్తోంది.
కేవలం వాటర్ ట్యాంకుకే పరిమితం కాకుండా, ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి సుమారు రూ. 6 కోట్లతో గ్రామంలో మౌలిక సదుపాయాల జాతర మొదలుపెట్టారు. `పల్లె పండుగ` పథకం కింద గ్రామంలోని ప్రతి గల్లీలో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ముఖ్యంగా స్థానిక స్కూల్ నుండి లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న బీటీ రోడ్డు ఆ ప్రాంత ప్రయాణ కష్టాలను తీర్చనుంది. రోడ్లే కాదు, పశువుల కోసం గోకులాలు, పేదల కోసం 19 నూతన గృహాలు నిర్మిస్తూ కొణిదెలను ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతున్నారు.
కొణిదెల గ్రామం వ్యవసాయాధారిత ప్రాంతం కావడంతో, రైతుల అవసరాలను పవన్ గుర్తించారు. ఉపాధి హామీ పథకాన్ని తెలివిగా ఉపయోగించి 49 ఫీడర్ ఛానళ్లను అభివృద్ధి చేయించారు. కాలువలు, చెక్ డ్యాంల పునరుద్ధరణ పనులతో భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకున్నారు. ఒక దత్తత గ్రామం అంటే కేవలం రంగులు వేయడం కాదు, ఆ ఊరి ఆర్థిక మూలాలను బలపరచడమని పవన్ నిరూపిస్తున్నారు.
2019లో మొదలైన ఈ బంధం, నేడు అధికారంలోకి వచ్చాక మరింత బలపడింది. ``మీ ఊరి పేరు నా ఇంటి పేరు.. మిమ్మల్ని ఆదుకోవడం నా బాధ్యత`` అని ఆయన అన్న మాటలు నేడు క్షేత్రస్థాయిలో అక్షర సత్యాలవుతున్నాయి. పవన్ కల్యాణ్ చూపిస్తున్న ఈ ప్రత్యేక చొరవతో కొణిదెల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.