తెలంగాణ(Telangana) రాజకీయాల్లో ఒకప్పుడు కేసీఆర్ గొంతు విప్పితే.. రాష్ట్రం మొత్తం నిశ్శబ్దంగా వినేది. ఆయన మాటల్లోని పదును, వ్యంగ్యం ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేవి. కానీ, తాజాగా జగిత్యాల వేదికగా జరిగిన సభను చూశాక.. గులాబీ బాస్లో ఆ పాత టైగర్ కనిపించలేదా? అన్న సందేహం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. సభకు జనం వచ్చారు, ఎలివేషన్లు భారీగానే ఉన్నాయి.. కానీ కేసీఆర్ స్పీచ్ మొదలయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది.
సాధారణంగా కేసీఆర్ సభ అంటే అధికార పక్షంపై యుద్ధం ప్రకటించినట్లు ఉంటుంది. కానీ జగిత్యాల(Jagtial)లో మాత్రం ఆయన పూర్తి ఆత్మరక్షణలో కనిపించారు. తెలంగాణ ఉద్యమంలో తనేం చేశానో, గత పదేళ్లలో రాష్ట్రం ఎలా మారిందో చెప్పుకోవడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇది ఆయనలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిందనే సంకేతాలను పంపుతోంది. ప్రజలకు భవిష్యత్తుపై భరోసా ఇవ్వాల్సింది పోయి, గతాన్ని నెమరువేసుకోవడం చూస్తుంటే.. కేసీఆర్ తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలోని లోపాలను మేడిగడ్డ సాక్షిగా ఎండగడుతోంది. ఈ విషయంలో కేసీఆర్(KCR) గట్టిగా ఎదురుదాడి చేస్తారని అంతా భావించారు. కానీ చిత్రంగా ఆయన ఆ అంశాన్ని దాటవేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. మేడిగడ్డపై నోరు మెదపకపోవడం వెనుక నైతిక స్థైర్యం దెబ్బతిన్నదా? లేక ప్రత్యర్థుల విమర్శలకు ఆయన దగ్గర సమాధానం లేదా? అన్న చర్చ మొదలైంది. పైగా స్థానిక సమస్యలను వదిలేసి, హైదరాబాద్ హైడ్రా కూల్చివేతల గురించి జగిత్యాలలో మాట్లాడటం.. ప్రజల పల్స్ పట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారని స్పష్టం చేస్తోంది.
ఈ సభలో పార్టీ సెకండ్ క్యాడర్ అయిన కేటీఆర్(KTR), హరీష్ రావు గైర్హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. పార్టీలో అంతర్గత పోరు నడుస్తోందా? లేక కేసీఆర్ ఒంటరి పోరాటం చేస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది. ఒకప్పుడు జనంతో మమేకమయ్యే కేసీఆర్, ఇప్పుడు ప్రజల మధ్య ఒక దూరాన్ని మెయింటైన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. యుద్ధతంత్రంలో ఆరితేరిన గులాబీ బాస్.. ఇప్పుడు పదును లేని అస్త్రాలను నమ్ముకోవడం పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. జగిత్యాల సాక్షిగా బయటపడ్డ ఈ నీరసించిన సీన్ చూశాక.. కేసీఆర్ రాజకీయ చాప్టర్ ముగిసినట్లేనా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.