తమిళ స్టార్ హీరో జయం రవి(Jayam Ravi)కి.. అతడి భార్య ఆర్తికి మధ్య కొన్నేళ్ల నుంచి పెద్ద గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే. భార్య నుంచి విడాకులు తీసుకోవాలని భావిస్తున్న రవి.. ఆమె నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నాడు. కెనీషా అనే సింగర్తో అతను రెండేళ్ల ముందే సహజీవనం చేస్తూ వచ్చాడు. ఐతే భార్య నుంచి అధికారికంగా విడాకులు పొందకముందే కెనీషాతో కలిసి బయట కనిపించడంతో వీళ్లిద్దరూ సోషల్ మీడియాకు బాగా టార్గెట్ అయ్యారు. ఈ వ్యవహారంలో ఆర్తిని బాధితురాలిగా చూస్తూ ఇటు రవిని, అటు కెనీషాను నెటిజన్లు ట్రోల్ చేస్తూ వస్తున్నారు కొంత కాలంగా. ఐతే ఇటీవల ఒక కార్యక్రమానికి జంటగా హాజరైన తమ మీద విపరీతంగా విమర్శలు చేయడంతో తట్టుకోలేకపోయిన కెనీషా.. తాను జయం రవి నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఆమె సోషల్ మీడియా అకౌంట్లను కూడా డీయాక్టివేట్ చేసింది. మరోవైపు రవి.. ప్రెస్ మీట్ పెట్టి తన భార్య మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను, కెనీషాను సైబర్ బుల్లియింగ్ చేస్తున్న వారి మీద కోపంతో ఊగిపోయాడు. భార్య వేధింపుల వల్ల ఏళ్లుగా తాను ఎంత బాధ పడుతున్నది అతను వివరించాడు. అంతే కాక ఆమె విడాకులు ఇచ్చేవరకు తాను సినిమాల్లో నటించనంటూ పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.
రవి ప్రెస్ మీట్ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఆర్తి(Aarthi) నుంచి కచ్చితంగా స్పందన ఉంటుందని అందరూ భావించారు. ఆమె కూడా ప్రెస్ మీట్ పెడుతుందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆర్తి అలా చేయలేదు. ఒక సోషల్ మీడియా పోస్టు ద్వారా రవి ప్రస్తావన లేకుండా అతడికి కౌంటర్ వేసింది. ‘‘నిద్రపోతున్న సింహాన్ని ఎప్పుడూ లేపకూడదు. ముఖ్యంగా ఆడ సింహంతో మరింత జాగ్రత్తగా ఉండాలి. నా ఈ మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దు. అవసరమైతే నా పిల్లలను, నా గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రస్తుతం అనుభవిస్తున్న లగ్జరీ జీవితాన్ని త్యజించి బయటకు వచ్చి సాధారణ గృహిణిలా నన్ను, నా పిల్లలను పోషించుకుంటూ నిజాయితీగా జీవించగలను. ఎందుకంటే, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు. తన పిల్లల ఫీజులు సహా ఆర్తికి సంబంధించి ఆర్థిక అవసరాలన్నీ తనే తీరుస్తున్నానని.. కానీ పిల్లలతో తనను కలవనీయడం లేదని రవి మోహన్ ఆరోపించిన నేపథ్యంలో ఆర్తి ఇలా స్పందించింది. ఐతే రవి అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆర్తి వాటి గురించి వివరంగా మాట్లాడాల్సిందని.. జస్ట్ ఇలా ఒక పోస్టు పెట్టి ఊరుకుంటే రవి వాదన కరెక్టే అన్న అభిప్రాయం బలపడుతుందనే వాదన వినిపిస్తోంది.