రాజధాని విషయంలో పూటకోమాట మాట్లాడుతున్నారంటూ..వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించా రు. ``2014లో రాజధాని అమరావతికి జై కొట్టిన పెద్దమనిషి.. అధికారంలోకి వచ్చేందుకు నక్కజిత్తుల మాటలు చెప్పాడు. రాజధానిలోనే తనకు ఇల్లు ఉందని.. తాను ఇక్కడే ఉంటానని.. రాజధానిని డెవలప్ చేస్తానని చెప్పాడు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత.. మూడు ముక్కలాటతో మూడురాజధానుల బాట పట్టాడు.
దీనిని ప్రజలు తిరస్కరించి.. 11 స్థానాలకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు.`` అని చంద్రబాబు అన్నారు. అయితే.. గొడ్డలి పార్టీ నేతకు బుద్ధి రావడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోయినా అహంకారం చావలే దని.. మూడు ముక్కలు పోయి.. మావిగన్ వచ్చిందని దుయ్యబట్టారు. ఇక, తాజాగా `విజయవాడే రాజధాని`అంటూ వితండ వాదం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి మానసిక స్థిరత్వం లేని వారితో రాజకీయాలు చేయడం తన జీవితంలో ఇదే తొలిసారని అన్నారు.
``నిన్న మావిగన్.. ఇప్పుడు విజయవాడ. ఈ సైకోతో రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అభిమానం కూడా ఇబ్బంది పడుతున్నాయి. రేపు ఎన్నికల సమయానికి ఏమంటాడో చూడాలి. ఏమైనా అంటాడు.. ప్రజలు జాగ్రత్తగా ఆలోచన చేయాలి`` అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆత్మాభిమానాన్ని దెబ్బతీయద్దని జగన్ను హెచ్చరించారు. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే పార్లమెంటులోనూ చట్టం చేశారని.. దీనిని కదపడం ఎవరి వల్లా కాదని తేల్చి చెప్పారు. ఇవన్నీ.. (జగన్ ప్రకటనలు) ప్రజలను గందరగోళానికి గురిచేసి, దేశవ్యాప్తంగా చర్చకు పెట్టి.. అమరావతికి వచ్చే పెట్టుబడుల ను, సంస్థలను రాకుండా చేయాలన్న భారీ కుట్రలో భాగమేనని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి కుట్రలను ఎలా తిప్పికొట్టాలో అలానే తిప్పికొడతామన్నారు.
ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నట్టు చంద్రబాబుతెలిపారు. ఒక ప్రాంతం ఎక్కువ, మరో ప్రాంతం తక్కువ అనే భావన తనకు లేదన్నారు. ప్రభుత్వం కూడా అన్ని ప్రాంతాలను డెవలప్ చేసేందుకు అవసరమైన మౌలిక వస తులతోపాటు పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 23 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయని.. రాజధానిలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. వీటిని చూసి ఓర్వలేని గొడ్డలి పార్టీ రాజధానిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తోందని విమర్శించారు. వీటిని ప్రజలు సమయ స్ఫూర్తితో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.