ఒక జమానాలో చట్టసభలను శాసనసభ్యులు దేవాలయాలుగా చూసేవారు. ప్రజల కోసం ప్రజల చేత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చట్టాలను తయారు చేసే సభలు ఎంతో హుందాగా నడిచేవి. కానీ, కాలగమనంలో ఆ హుందాతనం కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు శాసనసభ అంటే కీచక సభ లాగా మారి దూషణల పర్వం పరాకాష్టకు చేరింది. తమను ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వైసీపీ సభ్యులు అసలు సభకు హాజరు కాకుండా ఇటు రాజ్యాంగాన్ని అటు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శాసనసభ జరుగుతున్న తీరుపై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో అసెంబ్లీలో గౌరవప్రదమైన చర్చలు జరిగేవని, కానీ ప్రస్తుతం టేబుల్ ఎక్కే రాజకీయాలు జరుగుతున్నాయని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2004-09 మధ్యకాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబుల మధ్య అసెంబ్లీలో ఆసక్తికరమైన, అర్థవంతమైన చర్చలు జరిగేవని గుర్తు చేసుకున్నారు. అయితే సభలో ఎవరైనా గీత దాటినట్లు అనిపిస్తే అప్పటి శాసనసభ స్పీకర్ రోశయ్య వెంటనే స్పందించే వారని, ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఆచితూచి మాట్లాడాలని ఇరు పార్టీల సభ్యులకు హితవు పలికేవారని లోకేశ్ గుర్తు చేసుకున్నారు.
అటువంటి గొప్ప రాజకీయాలకు తమ తరం దూరమైందని లోకేశ్ బాధపడ్డారు. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని విశాఖపట్నంలోని ఆల్ ఇండియా రేడియో జంక్షన్ లో లోకేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాలలోకి రావాలని పిలుపునిచ్చారు.