ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీని మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ రాజా స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఉదయం 9.46 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఈనెల 9న టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సమక్షంలో గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ నూతన బృందం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరగనుంది.
కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ రాజాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీకి డాక్టర్ రాజా నాయకత్వం కొత్త ఉత్సాహాన్ని, కొత్త దిశను తీసుకువస్తుందని వారు ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై టీడీపీ శ్రేణులను ఏకం చేసి, పార్టీ సిద్ధాంతాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, తెలుగుదేశం పార్టీకి అంతర్జాతీయ స్థాయిలో బలమైన ఎన్నారై నెట్వర్క్ను నిర్మించడమే తమ బృందం ప్రధాన లక్ష్యమని డాక్టర్ రాజా తెలిపారు.
సభ్యుల బృందంతో ప్రత్యేక సమావేశం:
బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ రాజా తన 45 మంది సభ్యుల బృందంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ భవిష్యత్ కార్యాచరణ, ప్రపంచవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం, ఎన్నారై టీడీపీ కార్యకర్తలను సమన్వయం చేయడం, పార్టీ కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా కార్యాచరణ:
ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి 33 మంది సభ్యులు ప్రత్యక్షంగా హాజరై తమను తాము పరిచయం చేసుకున్నారు. ఆయా దేశాల్లో పార్టీ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై తమ అభిప్రాయాలు, సూచనలను వారు డాక్టర్ రాజాతో పంచుకున్నారు.“దేశం ఏదైనా… మనసులో టీడీపీ జెండానే” అనే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ కుటుంబాన్ని మరింత ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా డాక్టర్ రాజా పిలుపునిచ్చారు. ఎన్నారైలు కేవలం పార్టీ అభిమానులుగా కాకుండా, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన భాగస్వాములుగా నిలిచేలా సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.