నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడే నారా రోహిత్. 2009లో `బాణం` మూవీతో హీరోగా తన సినీ కెరీర్ ప్రారంభించిన నారా రోహిత్.. `సోలో`, `ప్రతినిధి` వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. 2018 తర్వాత సిల్వర్ స్క్రీన్ నుంచి బ్రేక్ తీసుకున్న రోహిత్.. 2024లో `ప్రతినిధి 2` మూవీతో మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా `భైరవం` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు.
విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నారా రోహిత్ తో పాటుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ కూడా హీరోలుగా నటించారు. మే 30న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. చిత్ర బృందం నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలతో ఇప్పటికే భైరవం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే.. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నారా రోహిత్.. తన ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ నారా భువనేశ్వరి, అన్న నారా లోకేష్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
తన లైఫ్ లో పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరిలు అత్యంత ముఖ్యమైన వ్యక్తులని.. వారి ప్రోత్సాహంతోనే తాము ఈ స్థాయిలో ఉన్నామని నారా రోహిత్ తెలిపాడు. అలాగే ఎదుటివారు చెప్పేది ఓపిగ్గా వినడం అనే అద్భుతమైన లక్షణాన్ని పెదనాన్న చంద్రబాబు నుంచే తాను నేర్చుకున్నానని రోహిత్ పేర్కొన్నారు. ఎవ్వరైనా సరే మన ముందుకు వచ్చి వారి సమస్య లేదా అభిప్రాయం చెబుతున్నప్పుడు పెదనాన్న దాన్ని పూర్తిగా వింటారు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణమది. ఆ లక్షణాన్ని అలవర్చుకోవడానికి తాను కూడా ప్రయత్నిస్తున్నానని రోహిత్ చెప్పుకొచ్చాడు. అలాగే నారా లోకేష్ గురించి మాట్లాడుతూ.. 2019 నుంచి 2024 మధ్యన అన్నయ్యలో వచ్చిన మార్పు, ఆయన పడ్డ కష్టం ఎందరికో స్ఫూర్తిదాయకమని.. కమ్ బ్యాక్ అంటే అలా ఉండాలని రోహిత్ ప్రశంసించాడు.