ఏపీ డిప్యూటీ సీఎం ;పవన్ కల్యాణ్ తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు.. సినీ రంగంలో కలకలం రేపింది. సీఎం చంద్రబాబు పట్ల కనీసం మర్యాద ఇవ్వాలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. తీవ్రస్థాయిలో మంటలు రేపుతున్నాయి. దీనిలో తన-మన అన్న ధోరణిని పక్కన పెట్టి మరీ పవన్ రెచ్చిపోయారు. చాలా కఠినంగానే వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాజకీయవర్గాల్లోనేకాకుండా.. సినీరంగంలోనూ చర్చ సాగుతోంది. తాజాగా టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. పవన్కే ఇబ్బందికలిగించామా? అని ఆయన ప్రశ్నించారు. దీనిని బట్టి ఐక్యత ఉందా? అనేది ఆయన క్వశ్చన్.
“సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి.. అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతోందనేది ఇప్పటికైనా సరే.. ప్రొడ్యూసర్స్ గానీ.. డిస్ట్రిబ్యూటర్స్ కానీ.. ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్ళనే మనం ఇరిటేట్ చేసామంటే.. మన ఐక్యత ఎలా ఉంది అని ప్రశ్నించుకునే సమయం వచ్చింది” అని బన్నీ వ్యాఖ్యలు చేశారు. ఇక, పవన్ లేఖను విడుదల చేసిన తర్వాత.. హైదరాబాద్ లోని ఓ అగ్రనిర్మాత ఇంట్లో పలువురు నిర్మాతలు భేటీ అయి శనివారం అర్ధరాత్రి వరకు తాజా పరిణామాలపై చర్చించారు.
నిజానికి గతంలో అల్లు అరవింద్, దిల్ రాజు సహా.. నట్టి కుమార్ వంటి నిర్మాతలు, దగ్గుబాటి సురేష్ వంటివారు కూడా పవన్ను కలుసుకున్నారు. సుదీర్ఘంగా ఆయన చర్చించారు. కానీ.. అప్పట్లో సీఎం చంద్రబాబును వారు కలుసుకోలేదు. కానీ.. ప్రభుత్వాని కి తాము అండగా ఉంటామని అప్పట్లోనే ప్రకటించారు. అయితే.. అనూహ్యంగా అసలు చంద్రబాబును సినీ వర్గాలు కలుసుకోక పోవడాన్ని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు పవన్. నిజానికి సీఎంతో అవసరం ఉంటే తప్ప.. ఇండస్ట్రీ అయినా.. ఇతర పారిశ్రామిక వర్గాలైనా కలుసుకోవు. వైసీపీ హయాంలో అయితే.. టికెట్ల ధరలనుపెంచేందుకు వీల్లేదన్న విషయం చర్చకు వచ్చినప్పుడు వారు వచ్చి కలిశారు.
కానీ.. దీనికి ముందు 2019 ఎన్నికల తర్వాత.. వెంటనే వచ్చి జగన్ను కలుసుకుని అభినందించిన వారు అంటూ ఎవరూ లేరు. ఎవరైనా అంతే.. అవసరం ఉంటే వస్తారు. లేకపోతే.. దూరంగానే ఉంటారు. అయితే.. పవన్ కల్యాణ్ను వారు ఆల్రెడీ సంప్రదించిన తర్వాత.. ప్రత్యేకంగా సీఎంను కలుసుకునేందుకు వారు ప్రయత్నించని మాట వాస్తవమే. అయితే.. ఇదొక్కటే పవన్ ఆగ్రహానికి కారణం కాదని తెలుస్తోంది. తన సినిమా హరిహర వీరమల్లు విడుదల కు ముందు థియేటర్లను బంద్ చేయడం అనే ప్రకటన ఆయనను కలవరపాటుకు గురి చేసిందన్న చర్చ ఉంది. అయితే.. బంద్ ప్రకటనను ఈ లేఖ విడుదల చేయడానికంటే ముందుగానే ఎగ్జిబిటర్లు ఉప సంహరించుకున్నారు. కానీ, ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఓ రేంజ్లో పవన్ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంత మంది వచ్చి ఏపీ సర్కారుకు మర్యాద ఇస్తారన్నది చూడాలి.