`ప్రొద్దుటూరు దసరా` వైభవం ఇప్పుడు ఓటీటీలో..!

admin
Published by Admin — November 09, 2025 in Movies
News Image

రాయలసీమలోని ప్రొద్దుటూరు పట్టణం పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది దసరా వేడుకల వైభవం. ఈ పండుగలో పట్టణం మొత్తం వెలుగుల సముద్రంగా మారిపోతుంది. స్థానిక దేవాలయాలు, వీధులు, రథయాత్రలు, సంగీతం, నృత్యాలు.. అన్నీ కలగలిసి భక్తి-సాంస్కృతిక ఉత్సవంగా ఆ పట్టణాన్ని ముస్తాబు చేస్తాయి. ఈ వేడుకలను చూడటానికి చుట్టుపక్కల గ్రామాలనే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివస్తారు.

ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఆలోచనతో దర్శకుడు మురళీ కృష్ణ తుమ్మ ఒక ప్రత్యేక డాక్యుమెంటరీని తెరకెక్కించారు. అదే `ప్రొద్దుటూరు దసరా`. బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ‘బాల్కనీ ఒరిజినల్స్’ బ్యానర్‌పై ప్రేమ్ కుమార్ వలపల ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమారు 40 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీ ప్రొద్దుటూరు దసరా ఉత్సవాల ఆరంభం నుంచి ముగింపు వరకూ జరిగే ప్రతి అద్భుత ఘట్టాన్ని చూపిస్తుంది.

అక్టోబర్ 31న విడుదలైన ఈ డాక్యుమెంటరీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రొద్దుటూరు సాంస్కృతిక గౌరవాన్ని, భక్తి రసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిందని విమర్శకులు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సంగీతం, దృశ్యాల అద్భుత కలయికతో ఈ చిత్రాన్ని రూపొందించిన కొత్త టీమ్‌కు భారీ ఎత్తున ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇక‌పోతే ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ ఓటీటీలోకి కూడా వ‌చ్చేసింది. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం “ఈటీవీ విన్” లో నవంబర్ 7 నుండి ప్రొద్దుటూరు దసరా స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ ప్రాజెక్టుకు స్టార్ సర్కిల్స్ డిజిటల్ ప్రమోషన్స్ అందించగా, కిలారి సుబ్బారావు పీఆర్‌ఓగా వ్యవహరించారు. స్థానిక పండుగను జాతీయ స్థాయికి చేర్చిన ప్రొద్దుటూరు దసరా , రాయలసీమ సంస్కృతిని కొత్త తరానికి పరిచయం చేసే ప్రయత్నంగా నిలిచింది. కాగా, రాయలసీమ పండుగల ఆత్మను, ప్రొద్దుటూరి సంస్కృతిని దగ్గరగా అనుభవించేలా చేసిన‌ ‘బాల్కనీ ఒరిజినల్స్’ బ్యానర్ నుంచి త్వరలో మరిన్ని సినిమాలు, డాక్యుమెంటరీలు రానున్నాయని సమాచారం.

Tags
Proddatur Dussehra Documentary ETV win Latest News OTT Balcony Originals
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News