ఆ ఒక్క `మాట‌`కే అర్హ‌త పోతుందా.. ఉండ‌వ‌ల్లి గారూ!

admin
Published by Admin — December 07, 2025 in Politics, Andhra
News Image

రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ .. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఉద్దేశించి.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు ఫైర‌వుతున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ఒక్క మాట‌కే అర్హ‌త పోతుందా? అని ప్ర‌శ్నిస్తున్నారు.  "కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది" అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని ఉండ‌వ‌ల్లి అన్నారు. ప‌వ‌న్‌పై తాను ఎంతో ఆస‌క్తిగా ఉన్నాన‌ని.. ఆయ‌న ఏదో ఒక రోజు ముఖ్య మంత్రి అవుతాన‌ని భావించాన‌ని చెప్పారు.

కానీ, దిష్టి వ్యాఖ్య‌ల‌తో అదంతా పోయింద‌ని ఉండ‌వ‌ల్లి అనేశారు. కానీ, ఒక్క మాట‌కే అంతగా ఆశ‌లు చ‌చ్చిపోతాయా?  అంత‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌త‌ప్పులు చేసేశారా? అనేది నెటిజ‌న్లు సంధిస్తున్న ప్ర‌శ్న‌. ఒక్కొక్క సారి నాయ‌కులు.. స‌మ‌యం-సంద‌ర్భాన్ని అనుస‌రించి.. వ్యాఖ్య‌లు చేస్తారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ వాదులే.. భూత‌ద్దంలో చూడ‌డం మానేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించొద్ద‌ని జ‌న‌సేన పార్టీ కూడా వివ‌ర‌ణ ఇచ్చింది. అయినా.. ఉండ‌వ‌ల్లి ఆ వ్యాఖ్య‌లు ప‌ట్టుకుని వేలాడ‌డం అర్ధం లేద‌న్న‌ది నెటిజ‌న్లు చెబుతున్న మాట‌.

ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్నప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత అనుచితం అంటూ.. ఉండ‌వ‌ల్లి సాగ‌దీశారు. దీనిలో అనుచితం ఏం ఉంటుంది..? అనేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కు అలా అనిపించింది.. ఎవ‌రి అభిప్రాయాలు వారికి ఉంటాయి. అయినా.. దిష్టి త‌గిలింద‌న్న మాట‌కు.. ఏకంగా.. ముఖ్య‌మంత్రిపీఠానికి ముడిపెట్ట‌డంఎందుకు? అనేది ఉండ‌వ‌ల్లికి తెలియ‌దా? అంటున్నారు. ఇక‌, ``నేను సీఎం అవుతాడని నమ్మిన వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినాల్సి రావడం నిజంగా దురదృష్టకరం" అని ఉండవల్లి వ్యాఖ్యానించ‌డాన్ని కూడా త‌ప్పుబ‌డుతున్నారు నెటిజ‌న్లు. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్లో త‌ప్పు ఒప్పులు వెత‌కడం కంటే.. ఆయ‌న అంత‌రార్థాన్ని అర్ధం చేసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని వ్యాఖ్యానిస్తున్నారు. 

Tags
Undavalli Arun Kumar Pawan Kalyan Telangana Ap Politics Janasena
Recent Comments
Leave a Comment

Related News