ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య రెండున్నర గంటల పాటు సాగిన సుదీర్ఘ ఏకాంత చర్చలు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. వీరిద్దరూ మాత్రమే ఉన్న ఈ సమావేశానికి సంబంధించి.. ఏం మాట్లాడుకున్నారన్న విషయాలు బయటకు పొక్కే అవకాశం లేదు. కాకుంటే.. ఇరు వర్గాలకు సంబంధించిన సన్నిహితులు చెప్పే అంశాల ఆధారంగా ఈ కథనం రాయటం జరుగుతోంది. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల మీద వీరిద్దరి చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు.
తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి అంశంపై విపక్ష వైసీపీ తీసుకున్న స్టాండ్ మీద ఎక్కువసేపు చర్చ జరగటంతో పాటు.. ఎవరికి మైలేజీ.. ఎవరికి డ్యామేజ్ జరిగిందన్న దానిపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. జంతుకొవ్వు అన్న పదం సిట్ రిపోర్టులో లేకపోవటాన్ని విపక్ష వైసీపీ హైలెట్ చేసిన సంగతి తెలిసిందే. అసలు లడ్డూలో వాడింది నెయ్యే కాదని.. అందులో వాడింది రసాయాలతో కూడిన నెయ్యి అన్న విషయాన్ని సదరు రిపోర్టు స్పష్టంగా వెల్లడించినప్పటికి.. వైసీపీ వ్యూహాత్మకంగా జంతుకొవ్వు లేదన్న అంశాన్ని హైలెట్ చేసింది.
జంతుకొవ్వుతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ ప్రజల్ని తప్పుదారి పట్టించుకున్నట్లుగా వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీని ప్రభావం ఎంత ఉందన్న అంశంతో పాటు.. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉదంతంపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలిసింది. ఈ మొత్తం ఉదంతం రెండు పార్టీల మధ్య ఉన్న బంధాన్ని బీటలు వారేలా నేరేషన్ ను వైసీపీ ప్రమోట్ చేసిన అంశం చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
కల్తీ నెయ్యి ఎపిసోడ్ లో మాజీ మంత్రి అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్ల మీద టీడీపీ నేతలు,కార్యకర్తల దాడులు, ఇళ్లను తగలబెట్టిన వైనానికి సంబంధించిన అంశాలపైనా చర్చ జరిగింది. ప్రతీకార రాజకీయాలకు దూరంగా.. డెవలప్ మెంట్ మీదనే ఫోకస్ చేయాలన్న కూటమి సర్కారు తీరుకు భిన్నంగా ఇటీవల పరిణామాలు ఉన్నాయన్న అంశాన్ని పవన్ ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. ఈ అంశాల కారణంగానే వీరిద్దరి మధ్య ఏకాంత భేటీ ఎక్కువసేపు జరిగినట్లుగా తెలుస్తోంది. త్వరలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల పంపకం మీదా ఇరువురు అధినేతల మధ్య చర్చ జరిగినట్లుగా చెబతున్నారు. బీజేపీ తమకు రెండు స్థానాల్ని ఇవ్వాలని కోరుతున్న వేళ.. జనసేనకు ఒక స్థానాన్ని ఇవ్వాలన్న విషయంపై పవన్ పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు భర్తీ చేయాల్సిన పదవులు.. నామినేటెడ్ పదవుల విషయంలో నిర్ణయ వేగాన్ని మరింత పెంచాలన్న అంశంపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది.