సంప్రదాయ రాజకీయనేతలకు భిన్నంగా కనిపించే జాతీయ నాయకుల్లో శశిథరూర్ ఒకరుగా కనిపిస్తారు. ఆయన రోటీన్ రాజకీయ నాయకులకు భిన్నమైన తీరు ఆయనలో కనిపిస్తుంది. విషయం ఏదైనా తనదైన రీతిలో రియాక్టు అయ్యే తీరు శశిథరూర్ మాటల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి కాస్త దూరంగా.. అధికార బీజేపీకి దగ్గరవుతున్నట్లుగా కనిపించటం తెలిసిందే.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఒక కీలక వార్తలో ఆయన పేరు వచ్చింది. ఇంతకూ విషయం ఏమంటే.. అగ్రరాజ్యం అమెరికాలో దిగ్గజ మీడియా సంస్థల్లో ఒకటైన ది వాషింగ్టన్ పోస్టు మీడియా సంస్థలో తన ఉద్యోగుల్ని కుదించింది. అది కూడా ఎంత భారీగా అంటే.. మొత్తంలో మూడు వంతుల ఉద్యోగుల్ని తీసేశారు. ఇందులో ఎంపీ శశిథరూర్ కొడుకు ఇషాన్ ఒకరు ఉండటం గమనార్హం. ఇది చాలా చెడ్డ రోజుగా ఇషాన్ పేర్కొన్నారు.
‘దాదాపు పన్నెండేళ్లుగా కలిసి పని చేసిన అద్భుతమైన జర్నలిస్టుల కోసం నా గుండె బాధపడుతోంది. వారితో కలిసి పని చేయటం నా జీవితంలో గొప్ప గౌరవం’గా పేర్కొన్నారు. ది వాషింగ్టన్ పోస్టులో ఇషాన్ ‘వరల్డ్ వ్యూ’ అనే కాలమ్ ను నిర్వహిస్తున్నారు. ఆ కాలమ్ ను ఫాలో అయిన లక్షలాది ఫాఠకులకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ప్రస్తుతం ఈ ప్రముఖ మీడియా సంస్థకు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. 2013లో ఈ మీడియా సంస్థను కొనుగోలు చేసిన ఆయన.. వరుస నష్టాల నేపథ్యంలో తాజాగా భారీగా కోతకు తెర తీశారు. 1877లో ప్రారంభించిన ఈ మీడియా సంస్థను 2013లో అమెజాన్ అధినేత తన వ్యక్తిగత హోదాలో కొనుగోలు చేయటం తెలిసిందే. దీనికి.. అమెజాన్ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు. తన వ్యక్తిగ నిధులను ఈ మీడియా సంస్థ మీద అమెజాన్ అధినేత ఖర్చు చేసేవారు.