ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, అంబటి రాంబాబును అరెస్టు చేయడం తెలిసిందే. అయినా సరే, వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా చంద్రబాబుపై వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2003లో చంద్రబాబు తిరుమల కొండకు వెళ్లి రాష్ట్రమంతా చెడిపోవాలి, ప్రజలంతా నాశనం అవ్వాలి, తాను మాత్రమే బాగుండాలని కోరుకున్నారంటూ గోరంట్ల మాధవ్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి.
చెరపకురా చెడేవు అన్నట్టుగా కొండలు దిగి వచ్చే సరికే 23 క్లైమోర్ మెన్లు పేలాయని, చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారని విమర్శించారు. అందుకే అప్పటి నుండి చంద్రబాబు వేంకటేశ్వర స్వామిపై కక్ష పెంచుకున్నారని, తాను సీఎం అయి వెంకన్న స్వామి అంతు చూస్తానని పంతం పట్టారని షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ తర్వాతి ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారని, వెంకన్నే ఆయనను ఓడించాడని అన్నారు.
ఇన్నేళ్లయినా వెంకన్నపై చంద్రబాబుకు కక్ష ఇంకా తగ్గలేదని విమర్శించారు. పందులు, గేదెల మీద తుపాకులు పెట్టి జగన్ ను కాల్చుదామనుకున్నారని ఆరోపించారు. అయితే, వెంకన్న ఆపి..ఆ బుల్లెట్ ను చంద్రబాబు మీదకు వదిలాడని, ఆ బుల్లెట్ నుంచి తప్పించుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారని ఆరోపించారు.
తిరుమల వెంకన్న కలియుగ దైవం అని...చంద్రబాబు కుల దైవం కాదని అన్నారు. చంద్రబాబు కుటుంబంలో ఒక్కరికి కూడా వెంకటేశ్వర స్వామి పేరు పెట్టలేదని, జగన్ ముత్తాత పేరు వెంకట రెడ్డి అని లాజిక్ లేని వ్యాఖ్యలు చేశారు.
ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని రిపోర్టులిచ్చినా చంద్రబాబు నమ్మడం లేదని...ఇదే విషయాన్ని ప్రశ్నించిన అంబటి రాంబాబు, జోగి రమేశ్ లపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనలపై ఆంక్షలు పెట్టారని, అయినా లక్షలాది మంది తరలివచ్చారని అన్నారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న జగన్ కు రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని, రూట్ మార్చి గ్రామాల నుంచి తీసుకువచ్చారని..ఇప్పటికైనా ఆయనకు తగిన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.