ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళల ఆర్థిక సాధికారత కోసం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే మహిళలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం, వచ్చే నెలలో మరో రెండు సరికొత్త పథకాలతో మహిళా లోకానికి తీపికబురు చెప్పేందుకు సిద్ధమైంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అలాగే సెర్ప్ (SERP) ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహిళలపై వరాల జల్లు కురిపించనుంది.
డ్వాక్రా మహిళల కుటుంబాల్లో పిల్లల ఉన్నత చదువులు మరియు కుమార్తెల వివాహాల కోసం ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి అనే రెండు కీలక పథకాలను తీసుకువస్తోంది. ఈ పథకాల కింద అర్హులైన ప్రతి మహిళకు గరిష్టంగా రూ. లక్ష వరకు ఆర్థిక సాయం అందుతుంది. అది కూడా కేవలం పావలా వడ్డీకే అందించడం విశేషం.
పెళ్లికి `కల్యాణ లక్ష్మి`.. చదువుకు `విద్యాలక్ష్మి`!
డ్వాక్రా మహిళల ఇంట్లో కుమార్తె పెళ్లి ఉన్నా లేదా పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజులు కట్టాలన్నా.. ఇకపై అప్పుల కోసం ఇతరుల దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. స్త్రీనిధి బ్యాంక్ ద్వారా రూ. 10 వేల నుండి రూ. 1 లక్ష వరకు రుణాన్ని ప్రభుత్వం మంజూరు చేయనుంది. అయితే డ్వాక్రా సంఘాల్లో కనీసం 6 నెలల నుంచి కొనసాగుతున్న సభ్యులు మాత్రమే ఈ పథకాలకు అర్హులు. అలాగే పెళ్లి కోసం అయితే లగ్నపత్రిక, చదువుల కోసం అయితే పిల్లల అడ్మిషన్ లెటర్, ఫీజు వివరాలు సమర్పిస్తే చాలు, నేరుగా నగదు అందుతుంది. ఇక తీసుకున్న రుణాన్ని 48 వాయిదాల్లో తిరిగి చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోంది.
కాగా, సెర్ప్ (SERP) 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ డబుల్ ధమాకా పథకాలను ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. మార్చి 8 నుంచి ఈ విప్లవాత్మక మార్పు మొదలుకానుంది. డ్వాక్రా సంఘాల్లో క్రమశిక్షణతో ఉండే ప్రతి మహిళా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.