టీడీపీ యువ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్.. 2023, జనవరిలో ప్రారంభించి.. పూర్తి చేసిన సుదీర్ఘ `యువగళం` పాదయాత్ర ప్రజల మనసులో బలమైన ముద్ర వేసింది. లోకేష్ పాదయాత్ర చేసిన అన్ని ప్రాంతాల్లోనూ టీడీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. నెల్లూరు జిల్లాలో అసలు వైసీపీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఇక, పాదయాత్ర సమయంలో నారా లోకేష్కు.. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇలా.. యువగళం లోకేష్కు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఈ నేపథ్యంలో యువగళం శాస్వతంగా ప్రజల్లో గుర్తుండిపోయేలా టీడీపీ కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రెండు రూపాల్లో యువగళాన్ని ప్రజలు గుర్తుంచుకునేలా చేస్తోంది. పాదయాత్ర సమయంలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు.. కొన్ని చోట్ల సామాజిక వర్గాలకు కమ్యూనిటీహాళ్లను నిర్మిస్తున్నారు. సీమ సహా.. కోస్తాంధ్రలో కూడా ఈ నిర్మాణాలు సాగుతున్నాయి. వీటికి యువగళం కమ్యూనిటీ కేంద్రాలుగా పేరు పెట్టున్నారు. ఇవి శాశ్వతంగా ఆయా వర్గాలకు గుర్తుంటాయని భావిస్తున్నారు.
అదేవిధంగా బాలికలకు రాష్ట్ర వ్యాప్తంగా సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీ గా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు.. సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనికి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్పందన వచ్చింది. ఉత్తరాంధ్రలోని రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమ సొంత సొమ్మును ఖర్చు చేసి బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు.
ప్రస్తుతం నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో కూడా బాలికలకు సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ సైకిళ్లపై కూడా.. `యువగళం` పేరును ముద్రించనున్నారు. అలానే.. రైతులకు రూ.2000లోపు ఖరీదయ్యే పనిముట్లను కొనుగోలు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా.. రైతులు కూడా లోకేష్ చేసిన యువగళం పాదయాత్రను మరిచిపోకుండా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ.. వచ్చే మూడు మాసాల్లోనే పూర్తికానున్నాయి. తద్వారా.. యువగళం గుర్తుండిపోయేలా టీడీపీ ప్లాన్ చేసింది.